భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నగాల్ చరిత్ర సృష్టించాడు. మూడేళ్ల తర్వాత ఓ గ్రాండ్స్లామ్ టోర్నీకి అర్హత సాధించిన ఈ భారత సింగిల్స్ ఆటగాడు. ఆస్ట్రేలియా ఓపెన్లో సంచలన విజయం నమోదు చేశాడు. మంగళవారం జరిగిన తొలి రౌండ్లో సుమిత్ నగాల్ 6-4, 6-2, 7-6( 7-5)తో 27వ ర్యాంకర్ అలెగ్జండర్ బబ్లిక్(కజకిస్థాన్)ను ఓడించాడు.
ఈ విజయంతో రెండో రౌండ్లోకి దూసుకెళ్లాడు. ఆస్ట్రేలియా ఓపెన్ చరిత్రలో దాదాపు మూడున్నర దశాబ్దల తర్వాత ఓ సీడెడ్ ఆటగాడిన ఓడించి భారత ఆటగాడిగా నగాల్ చరిత్రకెక్కాడు.

1989లో భారత టెన్నిస్ దిగ్గజం రమేశ్ కృష్ణన్.. అప్పటి వరల్డ్ నెంబర్ 1 మ్యాట్స్ విలాండర్ను రెండో రౌండ్లో ఓడించాడు. ఇక తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సాయం చేశాడని సుమిత్ నగాల్ తెలిపాడు. ఓ ప్రముఖ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను చెప్పిన ఈ విషయం ప్రస్తుతం వైరల్గా మారింది.
'విరాట్ కోహ్లీ ఫౌండేషన్ 2017 నుంచి నాకు అండగా నిలిచింది. గత రెండేళ్లుగా నేను దారుణంగా విఫలమయ్యాను. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాను. కోహ్లీ మద్దతు ఇవ్వకపోతే ఏం చేయాలనే దానిపై కూడా నాకు క్లారిటీ లేదు. కెనడాలో ఓ టోర్నీ ముగిసిన తర్వాత జర్మనీకి ప్రయాణిస్తున్న సమయంలో నా వాలెట్లో కేవలం 6 డాలర్లు మాత్రమే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులను చాలా సార్లు ఎదుర్కొన్నాను. కానీ వాటి నుంచి ఎలాగోలా గట్టెక్కాను. అథ్లెట్లకు అర్థిక సాయం అందిస్తేనే దేశంలో క్రీడారంగం అభివృద్ధి చెందుతుంది. విరాట్ కోహ్లీ నుంచి మద్దతు పొందడం నా అదృష్టం'అని 2019లో ఓ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుమిత్ నగాల్ తెలిపాడు.
ఇక ఏటీపీ టూర్లో పాల్గొనడానికి సుమారు కోటి అవసరమైన దశలో తన అకౌంట్లో రూ. 80 వేలు మాత్రమే ఉన్నాయని చెప్పాడు. ఆస్ట్రేలియా ఓపెన్లో సుమీత్ నగాల్ సాధించిన తాజా విజయంతో అతనికి ఖాతాలో రూ. 98 లక్షలు చేరాయి. అంతకుముందు క్వాలిఫై టోర్నీలో విజేతగా నిలిచినందుకు రూ. 65 లక్షలు దక్కాయి. రెండో రౌండర్లో చైనా ప్లేయర్ జున్చెంగ్ షాంగ్ను ఓడిస్తే రూ. 1.40 కోట్లు దక్కనున్నాయి.