లండన్: వరల్డ్ నెంబర్ వన్, ఆస్ట్రేలియా టెన్నిస్ స్టార్ యాష్లే బార్టీ చరిత్ర సృష్టించింది. 41 ఏళ్ల తర్వాత వింబుల్డన్ టైటిల్ గెలిచిన తొలి ఆస్ట్రేలియా మహిళా టెన్నిస్ ప్లేయర్గా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. పట్టుదలతో కష్టపడితే ఏనాటికైనా కలలు నిజమవుతాయని యాష్లే బార్టీ నిరూపించింది. టెన్నిస్ రాకెట్ పట్టినప్పటి నుంచి ఒక్కసారైనా వింబుల్డన్ టైటిల్ సాధించాలని కలలు కన్నానని ఫైనల్కు ముందు చెప్పిన ఈ వరల్డ్ నెంబర్ వన్.. 'హౌస్ఫుల్' సెంటర్ కోర్టులో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో అద్భుత ఆటతీరుతో తన కలను నిజం చేసుకుంది. ఎనిమిదో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)తో జరిగిన తుది పోరులో టాప్ సీడ్ యాష్లే బార్టీ 6-3, 6-7 (4/7), 6-3తో విజయం సాధించి వింబుల్డన్ చాంపియన్గా అవతరించింది.
యాష్లే బార్టీ టెన్నిస్ ప్లేయరే కాకుండా ఓ ప్రోఫెషనల్ క్రికెటర్ కూడా. 2011లో జూనియర్ బాలికల వింబుల్డన్ టైటిల్ నెగ్గిన బార్టీ 2014లో ఆటపై ఆసక్తి కోల్పోయి రెండేళ్లపాటు టెన్నిస్ నుంచి బ్రేక్ తీసుకుంది. 2015-2016లో బిగ్బాష్ మహిళల టీ20 క్రికెట్ లీగ్లో బ్రిస్బేన్ హీట్ జట్టు తరఫున బరిలోకి దిగింది. 10 మ్యాచ్లు ఆడిన యాష్లే బార్టీ.. అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది. ఓ మ్యాచ్లో అత్యధికంగా 39 పరుగులు చేసింది.
అయితే క్రికెటర్గా అంతగా సఫలం కాకపోవడంతో బార్టీ 2016లో టెన్నిస్లో పునరాగమనం చేసింది. 2019లో ఫ్రెంచ్ ఓపెన్ను కైవసం చేసుకున్న ఈ ఆసీస్ అమ్మాయి.. తాజాగా వింబుల్డన్ టైటిల్ను తన ఖాతాలో వేసుకుంది. వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ నెగ్గిన మూడో ఆస్ట్రేలియా క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. గతంలో మార్గరెట్ కోర్ట్ స్మిత్ (1963, 1965, 1970), ఇవోన్ గూలాగాంగ్ (1971, 1980) ఈ ఘనత సాధించారు. ప్రొఫెషనల్ క్రికెటర్ అయిన బార్టీ టెన్నిస్లోనూ బ్యాటింగ్ తరహా ట్రిక్స్తో ప్రత్యర్థులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. టెన్నిస్ రాకెట్ను బ్యాట్లా భావిస్తూ బంతిని బాదుతూ ఉంటుంది. ఇది ఆమెకు స్పెషల్ అడ్వాంటేజ్గా మారింది. తన జీవితంలో క్రికెటర్గా కొనసాగిన క్షణాలను తాను మరిచిపోలేనని బార్టీ చెప్పుకొచ్చింది.