ప్రతిష్టాత్మక టెన్నిస్ గ్రాండ్స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ 2025లో తొలి రౌండ్లోనే నిష్క్రమించిన రష్యా ప్లేయర్ డాని మెద్వెదెవ్కు నిర్వాహకులు భారీ జరిమాన విధించారు. ఫ్రాన్స్ ప్లేయర్ బెంజమిన్ బోంజితో జరిగిన పోరులో మెద్వెదెవ్ 3-6, 5-7, 7(5)-6, 6-0, 4-6 తేడాతో ఓటమిపాలయ్యాడు. ఈ ఓటమిని భరించలేకపోయిన మెద్వెదెవ్ తన రాకెట్ను విరగ్గొట్టాడు. అంతకుముందు కోర్టులో ప్రేక్షకులతోనూ అనుచితంగా ప్రవర్తించాడు.
అసభ్యకరమైన సైగలతో ప్రేక్షకులను రెచ్చగొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కాగా.. సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే అతనిపై నిర్వాహకులు రూ. 37 లక్షలు(42,500 డాలర్లు) జరిమానా విధించారు. క్రీడా స్ఫూర్తికి విరుద్దంగా ప్రవర్తించినందుకు 30వేల డాలర్లు, టెన్నిస్ రాకెట్ విరగొట్టినందుకు 12, 500 డాలర్లు జరిమానా వేసారు. దాంతో తొలి రౌండ్ ఆడినందుకు అతనికి వచ్చే రూ. 96,40,000 ఫ్రైజ్మనీలో మూడో వంతు కోత పడింది.

తొలి రౌండ్ మ్యాచ్లో వరుసగా రెండు సెట్లు కోల్పోయినప్పటికీ మెద్వెదెవ్ పోరాడిన తీరు ఆకట్టుకుంది. మూడు, నాలుగో సెట్లలో గెలిచి సమంగా నిలిచాడు. కానీ, హోరాహోరీగా సాగిన ఐదో సెట్లో బెంజిమన్ బోంజి గెలవడంతో మెద్వదేవ్కు నిరీక్షణ తప్పలేదు. అయితే మూడో సెట్ గేమ్ పాయింట్కు మెద్వెదెవ్ సమీపంగా ఉండగా.. ఓ ఫొటో గ్రాఫర్ ఆటకు ఆటంకం కలిగించడంతో అంతరాయం కలిగింది. ఆ సమయంలో మెద్వెదెవ్ సహనం కోల్పోయి అంపైర్ గ్రెగ్తో వాగ్వాదానికి దిగాడు. ఈ చర్యను ప్రేక్షకులు తప్పుబట్టారు. మెద్వెదెవ్ను హేళన చేశారు. అందుకు అతను కూడా ప్రతిస్పందనగా అరుస్తూ రెచ్చగొట్టాడు. ఆ సెట్తో పాటు నాలుగో సెట్ గెలిచి మరింత అసభ్యకరమైన సైగలు చేశాడు.
ఈ ఏడాది మెద్వెదెవ్కు కలిసి రాలేదు. ఆస్ట్రేలియా ఓపెన్ రెండో రౌండ్లో.. ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్లో తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. తాజాగా బోంజి చేతిలో పరాజయం చవిచూశాడు.