సిన్సినాటి: యూఎస్ ఓపెన్ తర్వాత టెన్నిస్కు గుడ్బై చెప్పాలని భావిస్తున్న వెటరన్ స్టార్ సెరెనా విలియమ్స్ వరుసగా రెండో టోర్నీలోనూ ఆరంభంలోనే తిరుగు ముఖం పట్టింది. సిన్సినాటి మాస్టర్స్ మొదటి రౌండ్లో 40 ఏళ్ల సెరెనా 4-6, 0-6 తేడాతో యూఎస్ ఓపెన్ చాంపియన్ ఎమ్మా రదుకాను చేతిలో ఓడింది. 19 ఏళ్ల ప్రత్యర్థితో పోరులో తొలి సెట్లో కాస్త పోరాడిన సెరెనా.. రెండో సెట్లో పూర్తిగా చేతులెత్తేసింది.
గతవారం జరిగిన కెనడా మాస్టర్స్లో ప్రీక్వార్టర్ ఫైనల్స్లోనే సెరెనా నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈనెలాఖరులో ప్రారంభమయ్యే యూఎస్ ఓపెన్లో సెరెనా ఏవిధంగా ఆడుతుందో చూడాలి. మరోవైపు ఒసాక (జపాన్) 4-6, 5-7తో షువాయి జంగ్ (చైనా) చేతిలో అనూహ్య ఓటమి చవిచూసింది. కోకో గాఫ్ (అమెరికా) గాయం కారణంగా మ్యాచ్ మధ్యలో తప్పుకుంది. ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 7-5, 6-1తో వీనస్ విలియమ్స్ (అమెరికా)పై నెగ్గింది. పురుషుల సింగిల్స్లో మెద్వెదెవ్ (రష్యా) మూడో రౌండ్లో అడుగుపెట్టాడు. ఈ ప్రపంచ నంబర్వన్ ఆటగాడు రెండో రౌండ్లో 6-4, 7-5తో బోటిచ్ (నెదర్లాండ్స్)పై గెలిచాడు.