ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీలో సంచలన ఫలితం నమోదైంది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్లో వరల్డ్ నెంబర్ వన్, టాప్ సీడ్ స్వియాటెక్(పోలాండ్) మూడో రౌండ్లోనే ఓటమిపాలైంది. చెక్ రిపబ్లిక్ చెందిన 19 ఏళ్ల అమ్మాయి, 50వ ర్యాంకర్ లిండా నోస్కోవా.. సంచలన ప్రదర్శనతో నాలుగు గ్రాండ్స్లామ్ టైటిల్స్ విజేత అయిన స్వియాటెక్కు షాకిచ్చింది.
2 గంటల 20 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో నోస్కోవా 3-6, 6-3, 6-4తో స్వియాటెక్ను ఓడించింది. లిండా నోస్కోవా కెరీర్లో ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఓ గ్రాండ్స్లామ్ టోర్నీలో ఆమె తొలిసారి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకుంది.

ఇతర మ్యాచ్ల్లో చైనా ప్లేయర్, 12వ సీడ్ కిన్వెన్ జెంగ్ 6-4, 2-6, 7-6(10/8)తో చైనాకే చెందిన వాంగ్ను ఓడించి ప్రిక్వార్టర్స్ చేరింది. మాజీ ఛాంపియన్, 18వ సీడ్ విక్టోరియా అజరెంకా(బెలారస్) 6-,7-5తో 11వ సీడ్ ఒస్టాపెంకో(లాత్వియా)పై గెలుపొందింది. స్వితోలినా(ఉక్రెయిన్) 6-2, 6-3తో గోల్బిక్(స్విట్జర్లాండ్)ను ఓడించింది.
డిఫెండింగ్ ఛాంపియన్ రిబకినా 6-7(1/7), 4-6తో జాస్మిన్ పౌలిని(ఇటలీ) చేతిలో ఓడి మూడో రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది.
పురుషుల సింగిల్స్లో రెండో సీడ్ అల్కరాస్(స్పెయిన్) 6-1, 6-1, 1-0తో షాంగ్(చైనా)పై గెలుపొందాడు. మెద్వెదేవ్ 6-3, 6-4, 6-3తో అగర్ అలియాసిమ్(కెనడా)పై విజయం సాధించగా.. జ్వెరెవ్ 6-2, 7-6(7/4), 6-2తో మిచెల్సన్(అమెరికా)ను ఓడించాడు.
11వ సీడ్ కాస్పర్ రూడ్(నార్వే) 4-6, 7-6(9/7), 4-6, 3-6తో నోరి(బ్రిటన్) చేతిలో ఓటమిపాలయయాడు. పురుషుల డబుల్స్లో శ్రీరామ్ బాలాజీ(భారత్)-విక్టర్ కార్నెయా(రొమెనియా) జోడీ ఓటమిపాలైంది. సెకండ్ రౌండ్లో ఈ జోడీ 3-6, 3-6తో మార్సెలో-మాట్ పవిచ్ జంట చేతిలో ఓటమిపాలైంది. మిక్స్డ్ డబుల్స్లో బోపన్న-బబోస్ జోడీ తప్పుకుంది.