టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్ స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్లో సంచలనాల పర్వం కొనసాగుతోంది. మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ ఆటగాళ్లు రెండో రౌండ్లోనే నిష్క్రమించారు. గతేడాది రన్నరప్, ప్రపంచ మూడో ర్యాంకర్ రిబాకినా(కజకిస్తాన్), ఐదో ర్యాంకర్ జెస్సికా పెగులా(అమెరికా) పేలవ ప్రదర్శనతో ఇంటిదారి పట్టారు.
దాంతో టాప్-10 ప్లేయర్స్లో టాప్ సీడ్ స్వియాటెక్(పోలాండ్), రెండో సీడ్ సబెలంకా(బెలారస్), నాలుగో సీడ్ కోకో గాఫ్(అమెరికా), పదో సీడ్ ఒస్టాపెంకో(లాత్వియా) మాత్రమే మిగిలారు.

గురువారం జరిగిన మహిళల సింగిల్స్లో రష్యాకు చెందిన 25 ఏళ్ల అనా బ్లింకోవా 6-4, 4-6, 7-6(22/20)తో రిబాకినాపై గెలుపొందగా.. క్లారా బురెల్(ఫ్రాన్స్) 6-4, 6-2తో పెగూలాను ఓడించింది. 2 గంటల 46 నిమిషాల పాటు జరిగిన బ్లింకోవా-రిబాకినా మ్యాచ్ చరిత్రకెక్కింది. నిర్ణాయక మూడో సెట్లో జరిగిన టై బ్రేక్ గ్రాండ్స్లామ్ టోర్నీల చరిత్రలోనే సుదీర్ఘంగా సాగిన టై బ్రేక్గా నిలిచింది.
31 నిమిషాల పాటు సాగిన 42 పాయింట్ల టై బ్రేక్లో చివరకు బ్లింకోవా 22-20తో విజయాన్ని ఖరారు చేసుకుంది. మరో మ్యాచ్లో వరల్డ్ నెంబర్ వన్ ఇగా స్వియాటెక్(పోలాండ్) 6-4, 3-6, 6-4తో డానియెలా కొలిన్స్(అమెరికా)పై విజయం సాధించింది. 3 గంటల 14 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో పోరాడి గెలిచింది. ఇతర మ్యాచ్ల్లో 14వ సీడ్ కసత్ కినా 6-4, 3-6, 3-6తో స్లోన్ స్టీఫెన్స్ చేతిలో, ఎమ్మా రాడుకానూ(బ్రిటన్) 4-6, 6-4, 4-6తో యాఫాన్ వాంగ్ చేతిలో ఓడింది.
11వ సీడ్ ఒస్టాపెంకో 6-0, 3-6, 6-4తో ఐలా తొమ్లాజనోవిచ్(ఆస్ట్రేలియా)పై, 12వ సీడ్ కిన్ వెన్ జెంగ్(చైనా) 6-3, 6-3తో కేటీ బుల్టర్(బ్రిటన్పై), 19వ సీడ్ స్వితోలినా(ఉక్రెయిన్) 6-1, 6-3తో తొమోవా(బల్గేరియా)పై విజయం సాధించారు.

పురుషుల సింగిల్స్లో భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నగాల్ పోరాటం రెండో రౌండ్లోనే ముగిసింది. గురువారం జరిగిన రెండో రౌండ్లో నగాల్ 6-2, 3-6, 5-7, 4-6తో జున్ చెంగ్ షాంగ్(చైనా) చేతిలో ఓడిపోయాడు. 22 అనవసర తప్పిదాలతో నగాల్ మూల్యం చెల్లించుకున్నాడు.
పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో రోహన్ బోపన్న(భారత్)-ఎబ్డెన్(ఆస్ట్రేలియా)7-6(7/5), 4-6, 7-6(10/2)తో డక్ వర్త్-పాల్మన్స్(ఆస్ట్రేలియా) జంటపై విజయం సాధించింది. అనిరుధ్-విజయ్ ప్రశాంత్(భారత్) ద్వయం 3-6, 4-6తో మరోజసన్-పుచోవిక్స్(హంగేరి) జోడీ చేతిలో ఓటమిపాలైంది.