హైదరాబాద్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన కెరీర్కు సంబంధించి మరో కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ ఏడాది జరగనున్న తొలి గ్రాండ్ స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 తన కెరీర్లో తన చివరి గ్రాండ్స్లామ్ టోర్నీ అని ప్రకటించింది. ఫిబ్రవరిలో దుబాయ్లో జరిగే డబ్ల్యూటీఏ 1000 టోర్నీతో రిటైర్ కావాలనుకుంటున్నట్లు ఇటీవల చెప్పిన 36 ఏళ్ల సానియా.. ఈనెల 16న ఆరంభం కాబోతున్న ఆస్ట్రేలియన్ ఓపెనే తన ఆఖరి గ్రాండ్స్లామ్ టోర్నీ అని ఇన్స్టాగ్రామ్ వేదికగా శుక్రవారం వెల్లడించింది. ఈ మేరకు ఓ భావోద్వేగపూరిత పోస్టును అభిమానులతో పంచుకుంది.
'30 ఏళ్ల క్రితం ఆరేళ్ల వయసులో నా టెన్నిస్ కల ఆరంభమైంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఏదో ఒకరోజు గ్రాండ్స్లామ్ టోర్నీలో ఆడాలని అనుకునేదాన్ని. ఆడటమే కాదు టైటిళ్లు కూడా సాధించా. 2005లో నా ప్రయాణం ఆస్ట్రేలియన్ ఓపెన్తోనే మొదలైంది. ఇప్పుడు అదే వేదికలో నా చివరి గ్రాండ్స్లామ్ ఆడబోతున్నా. ఆ తర్వాత వచ్చే నెలలో దుబాయ్ టోర్నీతో రాకెట్ వదిలేస్తా'' అని సానియా తెలిపింది.
Life update :) pic.twitter.com/bZhM89GXga
— Sania Mirza (@MirzaSania) January 13, 2023
కెరీర్కు ఇదే ఆఖరి సీజన్ అని గతేడాదే చెప్పిన సానియా మీర్జా మనసు మార్చుకుని ఈ సీజన్లోనూ ఆడుతోంది. ఆస్ట్రేలియన్ ఓపెన్లో అనా డానిలీనా (కజకిస్థాన్)తో కలిసి మహిళల డబుల్స్లో మీర్జా బరిలో దిగనుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్లో 2009లో మిక్స్డ్ డబుల్స్, 2014లో డబుల్స్ టైటిల్స్ను ఈ భారత స్టార్ గెలుచుకుంది.
2005లో హైదరాబాద్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన సానియా.. అదే ఏడాది యుఎస్ ఓపెన్లో ప్రిక్వార్టర్స్ చేరి సంచలనం సృష్టించింది. 2007లో కెరీర్లో అత్యుత్తమంగా 27వ ర్యాంకు సాధించిన ఆమె ఆ తర్వాత గాయాల కారణంగా డబుల్స్పైనే దృష్టి సారించింది. 2015లో సానియా డబుల్స్ కెరీర్ ఉన్నత శిఖరాలకు చేరుకుంది. స్విట్జర్లాండ్ తార మార్టినా హింగిస్ జతగా అప్రతిహత విజయాలు సాధించిన మీర్జా.. వింబుల్డన్, యుఎస్ ఓపెన్లో టైటిల్స్ గెలుచుకుంది. అదే ఏడాది ఆమె మహిళల డబుల్స్లో ప్రపంచ నంబర్వన్ ర్యాంకు కూడా సొంతం చేసుకుంది. కెరీర్ మొత్తం మీద 3 డబుల్స్, 3 మిక్స్డ్ డబుల్స్తో మొత్తం 6 గ్రాండ్స్లామ్ టైటిళ్లు సాధించింది.