న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీలో సత్తా చాటేందుకు అమెరికా దిగ్గజ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ సన్నద్ధమవుతోంది. కరోనా నేపథ్యంలో ఆమె సహచర ఆటగాళ్లంతా టోర్నీలో పాల్గొనడంపై మల్లాగుల్లాలు పడుతుంటే... సెరెనా మాత్రం నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళుతోంది.
ప్రాక్టీస్ నిమిత్తం ఆమె తన ఇంట్లోనే నూతన టెన్నిస్ కోర్టును ఏర్పాటు చేసుకుంది. ఇప్పటివరకు యూఎస్ ఓపెన్ డెకో టర్ఫ్ కోర్టుపై జరుగగా... ఈ సారి తొలిసారిగా లేకోల్డ్ కోర్టుపై జరుగనుంది. ఈ నేపథ్యంలో కొత్త కోర్టు స్థితిగతులపై అనుభవం పొందేందుకు స్వయంగా లేకోల్డ్ టెన్నిస్ కోర్టును ఏర్పాటు చేసుకున్న సెరెనా.. రెండు నెలలుగా అదే ఉపరితలంపై ప్రాక్టీస్ చేస్తోంది.
2018, 2019 యూఎస్ ఓపెన్ టోర్నీల్లో రన్నరప్గా నిలిచిన విలియమ్స్ ఈ సీజన్లో విజేతగా నిలిచి 24 గ్రాండ్స్లామ్ టైటిళ్ల రికార్డును సమం చేసేందుకు పట్టుదలతో ఉంది. 'ఈ ఏడాది యూఎస్ ఓపెన్ ఆడేందుకు నేను ఎక్కువ కాలం వెయిట్ చేయలేకపోతున్నా.. వీలైనంత త్వరగా న్యూయార్క్ తిరిగి రావాలని కోరుకుంటున్నా. టోర్నీని నిర్వహించేందుకు యూఎస్ టెన్నిస్ అసోసియేషన్ చేస్తున్న ప్రయత్నాలకు హ్యాట్సాఫ్. ప్రతీ ఒక్కరూ సేఫ్గా మ్యాచ్లు ఆడే ఎన్విరాన్మెంట్ కల్పిస్తారని కోరుకుంటున్నా.'అని సెరెనా వ్యాఖ్యానించింది.
ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 13 వరకు యూఎస్ ఓపెన్ జరగనుంది. ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్లను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే కరోనా పూర్తి స్థాయిలో అదుపులోకి రాకముందే.. టోర్నీ నిర్వహిస్తుండటంపై టాప్ ప్లేయర్లు జొకోవిచ్, రఫెల్ నడాల్ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.