
బర్మింగ్హామ్: ప్రపంచ చాంపియన్, భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పూసర్ల వెంకట (పీవీ) సింధు ఓ సువర్ణావకాశాన్ని చేజార్చుకుంది. చైనా, చైనీస్ తైపీ, దక్షిణ కొరియా స్టార్ షట్లర్లతోపాటు తెలుగుతేజాన్ని పదేపదే ఓడించే స్పెయిన్ స్టార్ కరోలినా మారిన్ కూడా గైర్హాజరయిన నేపథ్యంలో... ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో టైటిల్ గెలిచేందుకు ఏర్పడిన అనుకూల పరిస్థితులను సింధు సద్వినియోగం చేసుకోలేకపోయింది. మరోసారి సెమీ ఫైనల్ గండాన్ని దాటలేకపోయింది. అనవసరంగా ఒత్తిడిలోకి వెళ్లి ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ వరల్ట్ టూర్ సూపర్-1000 టోర్నీ నుంచి నిష్క్రమించింది.
తొమ్మిదోసారి ఆల్ ఇంగ్లండ్ ఓపెన్లో ఆడిన సింధు సెమీఫైనల్లో వెనుదిరగడం ఇది రెండోసారి. 2018 ఎడిషన్లోనూ సెమీస్ ఓడిన తెలుగమ్మాయి.. ఈ ఏడాదికి కూడా అదే సీన్ రిపీట్ చేసింది. దీంతో బ్రాంజ్ మెడల్తోనే సరిపెట్టుకుంది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సింధు 17-21, 9-21తో పోర్న్పవీ చోచువోంగ్ (థాయ్లాండ్) చేతిలో ఓడిపోయింది.
45 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో భారత స్టార్ తీవ్రంగా నిరాశపరిచింది. రెండో గేమ్లోనైతే సింధు కనీస ప్రతిఘటన కూడా చేయలేకపోవడం ఆశ్చర్యపరిచింది. అనవసర తప్పిదాలతో పలుమార్లు ప్రత్యర్థికి పాయింట్లు సమర్పించుకుంది.
జపాన్ ప్లేయర్ యమగూచితో క్వార్టర్ ఫైనల్లో గెలిచిన సింధు.. కొన్ని గంటల తేడాలోనే సెమీస్ మ్యాచ్ ఆడటం ప్రతికూల ప్రభావం చూపింది. అప్పటికే బాగా అలసిపోయిన తెలుగు షట్లర్.. చోచువోంగ్తో మ్యాచ్లో అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది. సింధు ఓటమితో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్లో భారత్ పోరాటం పూర్తిగా ముగిసింది.