నన్ను క్షమించండి
తమిళనాడుకు చెందిన చందలవాడ ఆనంద సుందరామన్ భవానీ దేవి అరంగేట్రం ఒలింపిక్స్లో స్ఫూర్తిదాయక ప్రదర్శన చేశారు. తొలి రౌండ్లో నడియా అజిజిపై 15-3 తేడాతో గెలిచి ఔరా అనిపించారు. అయితే రెండో రౌండ్లో ప్రపంచ మూడో ర్యాంకర్ మేనన్ బ్రూనెట్ చేతిలో 7-15 తేడాతో ఓటమి పాలయ్యారు. ఒలింపిక్స్ ఫెన్సింగ్లో ఒక మ్యాచ్ గెలిచిన తొలి భారతీయురాలిగా గర్వపడుతున్నానని ఆమె తెలిపారు.
అలాగే రెండో రౌండ్లో ఓడిపోయినందుకు క్షమాపణలు తెలియజేశారు. 'నా శక్తిసామర్థ్యాలమేరకు ప్రయత్నించినా విజయం సాధించలేకపోయా. నన్ను క్షమించండి. ప్రతి ముగింపు ఓ ప్రారంభానికి నాంది. శిక్షణను కొనసాగిస్తా. 2024 ఒలింపిక్స్ లక్ష్యంగా ముందుకు సాగుతా' అని భవానీ దేవి పేర్కొన్నారు.
|
గెలుపోటములు జీవితంలో సహజం
భవానీ దేవి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె ట్వీటుకు ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. శక్తిమేరకు పోరాడావంటూ ట్విట్టర్ వేదికగా అభినందించారు. 'మీ అత్యుత్తమ సామర్థ్యం మేరకు పోరాడారు. మాకదే ముఖ్యం. గెలుపోటములు జీవితంలో ఒక భాగం. మీ సేవలకు భారత్ గర్విస్తోంది. మన దేశ పౌరులందరికీ మీరు స్ఫూర్తిగా ఉండిపోతారు' అని ప్రధాని ట్వీట్ చేశారు. భారత అభిమానులు కూడా ఆమె అండగా నిలిచారు. బాగా ఆడారు అని ప్రశంసల వర్షం కురిపించారు. టోక్యో ఒలింపిక్స్ ఆరంభానికి ముందే భారత అథ్లెట్లతో ప్రధాని మాట్లాడి వారిలో స్ఫూర్తి నింపారు.
అనుకోకుండా ఆటను ఎంచుకున్నా
అనుకోకుండా ఆటను ఎంచుకున్నా.. అందులో రాణించేందుకు ప్రాణం పెట్టినట్లు భవానీ దేవి తాజాగా తెలిపారు. ఏషియన్ ఛాంపియన్షిప్లో కాంస్య పతకం సాధించినా తనను ఎవరూ గుర్తించలేదని.. తాను పడ్డ కష్టాలకు ఇప్పుడు గుర్తింపు లభిస్తోందన్నారు. 'నా 11వ ఏట పాఠశాలలో జరగబోతున్న క్రీడా పోటీల్లో భాగంగా ఏదైనా ఓ క్రీడను ఎన్నుకోవాలని చెప్పారు. అయితే ఫెన్సింగ్ను కేవలం ఒకే ఒక్కరు ఎంచుకొన్నారు. ఇదేదో ప్రత్యేకంగా ఉంది అని నేను దాన్నే ఎంచుకొన్నా' అని చెప్పారు. తన అమ్మ నగలమ్మి రూ.6 వేలతో మొట్టమొదటి ఫెన్సింగ్ కిట్ను కొనిచ్చిందన్నారు.
Tokyo Olympics 2021: కరోనానే కాదు.. ఒలింపిక్స్కు పొంచి ఉన్న మరో ముప్పు! షెడ్యూల్లో మార్పు!
ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా
స్పాన్సర్షిప్ ఇప్పించేందుకు తమ తల్లిదండ్రులు పలువురు అధికారుల ఇళ్లముందు గంటల కొద్దీ నిరీక్షించేవారని భవానీ దేవి తెలిపారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా.. అమ్మ నాన్నలు దైర్యంగా ముందుకుసాగరన్నారు. కొద్ది రోజుల క్రితం జరిగిన ఓ ఛాంపియన్షిప్లో గెలుపొందడంతో.. రూ.10 లక్షల లోన్ను తిరిగి చెల్లించానని, దీంతో తన తల్లిదండ్రుల మీద భారం తగ్గించానని వెల్లడించారు. ప్రస్తుతం ఓ ఇంటిని కొనేందుకు సన్నాహాలు చేస్తున్నానని, ఇల్లు కొని తన తల్లిదండ్రులను సర్ప్రైజ్ చేస్తానని భవానీ దేవి పేర్కొన్నారు.