కాలక్రమంలో మరో ఏడాది గడిచిపోనుంది. ఈ ఏడాది అంతర్జాతీయ క్రీడా వేదికలపై భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శన కనబర్చారు. అందని ద్రాక్షలా ఉన్న విజయాలను సొంతం చేసుకున్నారు. విశ్వ క్రీడారంగంలో తమదైన ముద్ర వేసి సరికొత్త శిఖరాలకు చేరుకున్నారు. అనూహ్య విజయాలతో భారత క్రీడా భవిష్యత్కు బంగారు బాటు వేసారు. ఈ ఏడాది భారత క్రీడాకారులు అందుకున్న చిరస్మరణీయ విజయాలపై ఓ లుక్కెద్దాం.
నీరజ్ చోప్రా సంచలన ప్రదర్శన..
భారత అథ్లెటిక్స్కు ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. రెండేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచిన భారత బళ్లెం వీరుడు నీరజ్ చోప్రా... ఈ ఏడాది అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పతకం సాధించాడు. ఆగస్టులో బుడాపెస్ట్లో జరిగిన ఈ మెగా ఈవెంట్లో నీరజ్ చోప్రా జావెలిన్ను 88.17 మీటర్ల దూరం విసిరి పసిడిని సొంతం చేసుకున్నాడు.

తద్వారా ఈ ఘనతను సాధించిన తొలి భారతీయుడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఏపీకి చెందిన మహిళా అథ్లెట్ జ్యోతి యెర్రాజీ బ్యాంకాక్లో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో 100 మీటర్ల హార్దిల్స్లో స్వర్ణ పతకం సాధించింది.
తెలంగాణ పంచ్ పవర్..
భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ సైతం ఈ ఏడాది అద్భుత ప్రదర్శన కనబర్చింది. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచిన నిఖత్ జరీన్.. ఆసియా క్రీడల్లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. న్యూఢిల్లీ వేదికగా జరిగిన ప్రపంచకప్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు నాలుగు స్వర్ణాలు లభించాయి.
ఆసియా క్రీడల్లో సెంచరీ..
చైనా వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో భారత్ తొలిసారి 100 పతకాల మార్క్ అందుకుంది. మొత్తం 107 పతకాలతో సరికొత్త చరిత్ర సృష్టించింది. చైనాలోని హాంగ్జౌ వేదికగా జరిగిన ఈ ఆసియా గేమ్స్లో భారత క్రీడాకారులు 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్యాలు సాధించారు. ముఖ్యంగా ఆర్చరీ ఈవెంట్లో తెలుగు అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మూడు స్వర్ణ పతకాలతో మెరిసింది.
పరుగుల రాణి పీటీ ఉష తర్వాత ఒకే ఆసియా క్రీడల్లో మూడు పతకాలు లేదా అంతకంటే ఎక్కువ బంగారు పతకాలు గెలిచిన భారత అథ్లెట్గా జ్యోతి సురేఖ గుర్తింపు పొందింది.
సింధు ఫ్లాప్.. సాత్విక్-చిరాగ్ జోరు..
బ్యాడ్మింటన్లో ఈ ఏడాది పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి దుమ్మురేపింది. ఆసియా ఛాంపియన్షిప్, ఆసియా క్రీడల్లో తొలిసారి డబుల్స్లో స్వర్ణ పతకాలు గెలిచిన ఈ జోడీ.. స్విస్ ఓఫెన్, ఇండియా ఓపెన్, ఇండోనేసియా ఓపెన్ టోర్నీల్లోనూ టైటిల్స్ సాధించింది. ఈ క్రమంలోనే వరల్డ్ ర్యాంకింగ్స్లో నెంబర్ వన్ ర్యాంక్ అందుకుంది.
పురుషుల సింగిల్స్లో ప్రణయ్ వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నాడు. మహిళల సింగిల్స్తో మాత్రం పీవీ సింధు తీవ్రంగా నిరాశపరిచింది.