హైదరాబాద్: ప్రతిష్టాత్మక డబ్ల్యూడబ్ల్యూఈ (వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్) ఈవెంట్కు రంగం సిద్దమైంది. ఇన్నాళ్లు టీవీల్లో చూసిన ఈ కుస్తీ పోటీలు.. ఇప్పుడు మన నగరం నడిబొడ్డున జరుగబోతున్నాయి. ఆరేళ్ల తర్వాత భారత్లో తొలిసారి డబ్ల్యూడబ్ల్యూఈ పోరుకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో వరల్డ్ రెజ్లింగ్ స్టార్స్ అభిమానులను అలరించబోతున్నారు.
డబ్లూడ్ల్యూఈ స్టార్స్ అయిన జాన్ సేనా, జిందర్ మహల్, ఇండస్ షేర్, నటాల్య మధ్య ఒళ్లు జల్దరించే పోరు నగరవాసులను కట్టిపడేయనుంది
ఈ డబ్ల్యూడబ్ల్యూఈ పోటీలకు మరికొన్ని గంటల్లో హైదరాబాద్లో తెరలేవనుంది. గచ్చిబౌలి స్టేడియం వేదికగా డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్పెక్టాకిల్ మ్యాచ్లకు రంగం సిద్ధమైంది.

గంట మోగడమే ఆలస్యం..బౌట్లో డిష్యుం..డిష్యుం అంటూ తలపడేందుకు రెజ్లర్లు రెడీ అయ్యారు. కండబలానికి బుద్ధిబలాన్ని జోడిస్తూ గెలిచేందుకు రెజ్లర్లు చేసే ప్రయత్నాలు అభిమానులను ఆకట్టుకోనున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానాన్ని పొందిన డబ్ల్యూడబ్ల్యూఈలో ఈ సారి భారత రెజ్లర్లతో పాటు ఇతర దేశాలకు చెందిన ప్రముఖ రెజ్లర్లు సత్తాచాటేందుకు సిద్దమయ్యారు. ఇప్పటికే తన వైవిధ్యమైన ఆటతీరుతో లెక్కకు మిక్కిలి టైటిళ్లు కొల్లగొట్టిన జాన్సేనా..ఫ్రీకిన్ రోలిన్స్ జతగా బరిలోకి దిగుతున్నాడు.
వీరిద్దరు గివోని విన్సీ, లుడ్విగ్ కైసర్తో అమీతుమీ తేల్చుకోనున్నారు. డబ్ల్యూడబ్ల్యూఈ ట్యాగ్ టీమ్ టైటిల్ కోసం ఇండస్ షేర్(సంగా, వీర్), కెవిన్ ఒవెన్స్, సమి జైన్ మధ్య ఫైట్ జరుగుతుంది. మహిళల డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్ టైటిల్ కోసం రియా రిప్లే, నటాల్యతో అమీతుమీ తేల్చుకోనుంది. వీరితో పాటు డ్రూ మెక్లెట్రీ, షాంకీ, రింగ్ జనరల్ గుంతర్, జియోనీ విన్సీ బరిలో దిగనున్నారు.
భారత్ నుంచి..:జిందర్ మహల్..డబ్ల్యూడబ్ల్యూఈలో పోటీపడుతున్న భారత రెజ్లర్. విదేశాల్లో విరివిగా జరిగే డబ్ల్యూడబ్ల్యూఈ పోటీల్లో పాల్గొనే మన దేశ రెజ్లర్లను వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. ఒకవేళ బరిలోకి దిగినా.. గుర్తింపు దక్కని రెజ్లర్లు చాలా మంది. కానీ బాహుబలి గ్రేట్ కాళీ వారసునిగా జిందర్ మహల్ డబ్ల్యూడబ్ల్యూఈలో దుమ్మురేపుతున్నాడు. కెరీర్ తొలి నాళ్లలో తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొన్న జిందల్.. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. 2016లో మళ్లీ బౌట్లో అడుగుపెట్టిన జిందల్.. ఎదురైన ప్రత్యర్థినల్లా ఓడిస్తూ ముందుకు సాగుతున్నాడు.
ఈ క్రమంలో స్టార్ రెజ్లర్లను మహల్ మట్టికరిపించాడు. జెయింట్ మెమోరియల్ బాటిల్ రాయల్ టోర్నీలో రన్నరప్గా నిలిచి సత్తాచాటాడు. స్టార్ రెజ్లర్ ర్యాండీ ఓర్టన్ను ఓడించి టైటిల్ విజేతగా నిలిచాడు. భారత్ నుంచి జిందర్ మహల్తో పాటు ఇండస్ షేర్ (వీర్ మహాన్, సంగా) కూడా ఉన్నారు.