న్యూఢిల్లీ: న్యాయం కావాలంటూ దేశం నడిబొడ్డున ఆందోళనలు చేస్తున్న భారత స్టార్ రెజ్లర్లకు తొలి ప్రపంచకప్ అందించిన కపిల్ దేవ్ సారథ్యంలోని టీమిండియా అండగా నిలిచింది. 1983 ప్రపంచకప్ టీమ్లోని కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, రోజర్ బిన్నీ తదితర ఆటగాళ్లు రెజ్లర్ల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరుని ఖండించారు.
విశ్వవేదికపై మువ్వెన్నల జెండాను రెపరెపలాడించిన రెజ్లర్ల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించడం తమను కలవరపరిచిందన్నారు. వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ ప్రెసిడెంట్, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ తమను లైంగికంగా వేధించాడని రెజ్లర్లు ఆందోళన చేస్తున్నారు. అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే తమ పతకాలను గంగా నదిలో కలిపేస్తామని కూడా హెచ్చరించారు.

పతకాలను గంగలో కలిపేందుకు హరిద్వార్ వెళ్లిన రెజ్లర్లు రైతు సంఘాలు నచ్చజెప్పడంతో చివరి నిమిషంలో తమ ఆలోచనను వాయిదా వేసారు. బ్రిజ్ భూషణ్పై చర్యలు తీసుకోకుంటే పతకాలను గంగలో కలుపుతామని హెచ్చరిస్తున్నారు. అయితే ఈ విషయంలో తొందరపడవద్దని కపిల్ సేన రెజ్లర్లను కోరింది.
'రెజ్లర్లతో పోలుసులు దురుసుగా ప్రవర్తించిన దృశ్యాలు మమ్మల్ని కలవరపరిచాయి. ఎంతో శ్రమకోర్చి దేశం కోసం సాధించిన పతకాలను గంగానదిలో కలిపేద్దామనే వారి ఆలోచన ఆందోళన కలిగిస్తోంది. ఆ పతకాల వెనక ఎంతో కృషి, త్యాగం ఉంది. అవి కేవలం వారికి లభించిన గుర్తింపు మాత్రమే కాదు.. వాటిలో ఈ దేశ ప్రతిష్ట కూడా ఇమిడి ఉంది.
ఈ విషయంలో వారు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని కోరుతున్నాం. అలాగే వారి కష్టాలకు వీలైనంత త్వరగా పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాం. చట్టం తన పని తాను చేస్తుంది. కాస్త ఓపికగా ఉండాలి'అని కపిల్ సేన తమ ప్రకటనలో రెజ్లర్లను విజ్ఞప్తి చేసింది.
గత ఆదివారం రెజ్లర్లు పార్లమెంట్ భవనం వద్దకు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని బలవంతంగా అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.