న్యూఢిల్లీ: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) ప్రెసిడెంట్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ను అరెస్ట్ చేయాలంటూ గత నెలరోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారత స్టార్ రెజ్లర్లు చేపట్టిన శాంతియుత నిరసన ఉద్రిక్తతకు దారి తీసింది. పార్లమెంట్ కొత్త భవనం ముందు శాంతి యుతంగా నిరసన చేపడుతామని వెళ్లిన భారత రెజ్లర్లను పోలీసులు ఈడ్చిపడేశారు.
భారత్ తరఫున ఒలింపిక్స్ పతకాలు సాధించారనే గౌరవం లేకుండా నెట్టేసి అదుపులోకి తీసుకున్నారు. కొత్తగా నిర్మితమైన పార్లెమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించడంతో రెండు కిలోమీటర్ల మేర పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ విషయాన్ని రెజ్లర్లకు తెలియజేసిన పోలీసులు.. అటు వైపు వెళ్లవద్దని సూచించారు.

వారి మాట వినని రెజ్లర్లు వినేశ్ ఫొగాల్, సాక్షి మాలిక్, బజరంగ్ పూనియాలతో పాటు తదితరులు పార్లమెంట్ వైపు తమ మార్చ్ను కొనసాగించే యత్నం చేశారు. దీంతో పోలీసులు వారి పట్ల కఠినంగా వ్యవహరించారు. బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోవాలని నెలరోజులుగా తాము ధర్నా చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించిన రెజ్లర్లు.. అతను కొత్త పార్లమెంట్ భవనంలోకి అడుగుపెడితే తమ ఆందోళనను మరింత ఉదృతం చేస్తామని ఇప్పటికే హెచ్చరించారు.
ఇందులో భాగంగానే ఆదివారం 'మహిళా సమ్మాన్ మహా పంచాయత్' కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. తమతో కలిసివచ్చిన నిరసనకారులతో రెజ్లర్లు పార్లెమెంట్ కొత్త భవనం వైపుగా నడిచారు. పోలీసులు ఏర్పాటుచేసిన బారీకేడ్లను తొలగించుకుని ముందుకుసాగేందుకు యత్నించారు.
ఈ క్రమంలో పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు.. ఆందోళనకారులను నిర్బంధించి వారిని పోలీసు వాహనాల్లో ఎక్కించారు. భారత స్టార్ రెజ్లర్ల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.