న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్, ఒలింపిక్ పతాక విజేత సాక్షి మాలిక్పై మాజీ రెజ్లర్, బీజేపీ ఎంపీ బబితా ఫోగాట్ మండిపడ్డారు. సాక్షిమాలిక్.. కాంగ్రెస్ పార్టీ తోలు బొమ్మని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ చెప్పినట్లు సాక్షి మాలిక్ చేస్తుందని ఆరోపించారు. మరోవైపు రెజ్లర్ల ఉద్యమాన్ని బబితా ఫోగాట్ తన స్వార్థానికి వాడుకునే ప్రయత్నం చేసిందని సాక్షి మాలిక్ ఆరోపించింది.
తన భర్తతో కలిసి ఓ వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసేందుకు ఇద్దరు బీజేపీ నేతలు బబితా ఫొగట్, తీర్థ్ రాణానే అనుమతి ఇప్పించారని ఓ లేఖను కూడా చూపించారు. ఈ వీడియోపై బబితా ఫోగాట్ ఘాటుగా స్పందించింది. 'సాక్షి మాలిక్, సత్యవర్త్ల వీడియో నన్ను బాధించింది. అదే సమయంలో నవ్వొచ్చింది.

వాస్తవానికి వారు చూపుతున్న అనుమతి లేఖలో నా పేరు కానీ, సంతకం కానీ లేవు. నిరసనకారులు ప్రధాని లేదా హోం మంత్రిని కలిసి కలవమని వాళ్లకు చెప్పినా వినలేదు. అనుమతి తీసుకుకోండా కాంగ్రెస్ నేతలు ప్రియాంక గాంధీ, దీపేందర్ హుడాల దగ్గరికి వెళ్లారు. ఇప్పుడిప్పుడే ప్రజలకు మీ అసలు రూపం తెలుస్తోంది.
నూతన పార్లమెంట్ ఆరంభం రోజున మీ హడావిడి, గంగా నదిలో పతకాలు విసిరేస్తామని చెప్పడం చూస్తుంటే కాంగ్రెస్ నాయకుల చేతిలో కీలుబొమ్మలుగా మారినట్టు అర్థమవుతోంది'అని బబితా ఫోగాట్ ఘాటుగా వ్యాఖ్యానించింది.
అయితే దీనికి కౌంటర్గా సాక్షి మాలిక్ కూడా స్పందించింది. 'సహచరులంతా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే మీరు ప్రభుత్వ ఒడిలో సేద తీరుతున్నారు. కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలవకుండా మీ సొంత లాభం చూసుకుంటూ ఇలా హేళన చేయడం సరికాదు'అని ట్విటర్ వేదికగా మండిపడింది.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్ను అరెస్ట్ చేయాలంటూ రెజ్లర్లు గత 6 నెలలకు దేశరాజధాని ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్తో చర్చలు జరిపిన రెజ్లర్లు నిష్పాక్షికమైన విచారణ చేపడుతామని హామీ ఇవ్వడంతో తమ నిరసనలకు బ్రేక్ ఇచ్చారు.
బ్రిజ్భూషణ్ సింగ్పై చార్జిషీట్ దాఖలయ్యాక.. మహిళా రెజ్లర్లు సాక్షి మాలిక్, బబితా ఫొగాట్ మాటల యుద్ధానికి తెర లేపడం అందర్నీ విస్మయానికి గురి చేస్తోంది. మరోవైపు బబితా ఫోగాట్ సోదరి వినేశ్ ఫోగాట్ మాత్రం ట్విటర్ వేదికగా న్యాయం కావాలని కోరుతుండటం గమనార్హం.