
ఎటూ తేల్చని సీబీఐ..
గతేడాది సీబీఐ ఈ కేసు విషయమై కోర్టుకు నివేదిక సమర్పించింది. ఉద్దేశ పూర్వకంగా రెజ్లర్ను ఇరికించినట్లు, కుట్ర జరిగినట్లుగా ఆధారాలేవీ లేవని అందులో పేర్కొంది. దీనిపై నర్సింగ్ తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేసినప్పటికీ కోర్టు నుంచి ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదని సీబీఐ వర్గాలు తెలిపాయి. సీబీఐ అధికారుల్ని నర్సింగ్ సంప్రదిస్తే విచారణ ఇంకా కొనసాగుతోందని సమాధానం వచ్చింది.

నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటా..
ఎన్నో క్లిష్టమైన కేసుల్ని దర్యాప్తు చేసే సీబీఐ ఈ చిన్న కేసులో ఎందుకు జాప్యం చేస్తుందో తెలియడం లేదన్నాడు. తనపై తనకు నమ్మకముందని... నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని పేర్కొన్నాడు. 31 ఏళ్ల రెజ్లర్ సోనెపట్లోని భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కేంద్రంలో శిక్షణ శిబిరానికి వచ్చాడు. ప్రస్తుతం క్వారంటైన్లో ఉండగా... ఈ నెల 15 నుంచి శిబిరం మొదలవుతుంది.

సత్తా చాటుతా..
పురుషుల ఫ్రీస్టయిల్ 74 కేజీల విభాగంలో తనకు పోటీదారుడైన స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్పై అనుమానాలున్నాయా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ‘గతం గతః. దాన్ని ఇప్పుడు తవ్వాలని అనుకోవడం లేదు. అయితే నాకు జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగొద్దనేదే నా కోరిక' అని అన్నాడు. వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్ తన సత్తా నిరూపించుకునేందుకు ఓ అవకాశంగా సద్వినియోగం చేసుకుంటానని చెప్పాడు. 2012 లండన్ ఒలింపిక్స్లో నర్సింగ్ 74 కేజీల విభాగంలో బరిలోకి దిగి తొలి రౌండ్లోనే ఓడిపోయాడు.


Click it and Unblock the Notifications












