భారత యువ గ్రాండ్ మాస్టర్, తెలుగు తేజం దొమ్మరాజు గుకేశ్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 18 ఏళ్ల వయసులో వరల్డ్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచి.. ఈ ఘనత సాధించిన అతిపిన్న వయస్కుడిగా గుకేశ్ నిలిచాడు. సింగపూర్ వేదికగా జరిగిన వరల్డ్ చెస్ ఛాంపియన్ టోర్నీ ఫైనల్లో గుకేశ్.. డిఫెండింగ్ ఛాంపియన్ చైనా స్టార్ డింగ్ లిరెన్ను ఓడించిన సంగతి తెలిసిందే.
18 ఏళ్ల 08 నెలల 14 రోజుల వయసులో గుకేశ్ ఈ ఫీట్ సాధించాడు. ఈ క్రమంలో కాస్పరోవ్ రికార్డ్ను అతను అధిగమించాడు. 1985లో కాస్పరోవ్ 22 ఏళ్ల 6 నెలల 27 రోజుల వయసులో వరల్డ్ చెస్ ఛాంపియన్గా నిలిచాడు. గత 39 ఏళ్లుగా ఈ రికార్డ్ చెక్కు చెదరకుండా ఉండగా.. గుకేశ్ బద్దలు కొట్టాడు.

ఈ విజయం ద్వారా గుకేశ్కు భారీ క్యాష్ ప్రైజ్ దక్కింది. దాంతో అతను ఒక్కసారిగా కోటీశ్వరుడయ్యాడు. వరల్డ్ చెస్ ఛాంపియన్గా నిలిచినందుకు గుకేశ్కు రూ. 11.34 కోట్ల భారీ క్యాష్ ప్రైజ్ దక్కింది. అయితే ఇందులో నుంచి గుకేశ్.. భారత ప్రభుత్వానికి రూ. 4.67 కోట్లను పన్నురూపంలో చెల్లించనున్నాడు.
ఇది టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ 2025 ప్రైజ్ కంటే ఎక్కువ కావడం విశేషం. అనామక ప్లేయర్గా ధోనీని సీఎస్కే రూ. 4 కోట్లకే రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. ఐదేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉన్న భారత ఆటగాళ్లను అనామక ప్లేయర్లుగా పరిగణించాలనే నిబంధనను మళ్లీ ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. దాంతో ధోనీని అనామక ప్లేయర్గా సీఎస్కే తక్కువ ధరకే కొనుగోలు చేసింది.
ఈ క్రమంలోనే గుకేశ్ చెల్లించే పన్నుపై నెట్టింట జోకులు పేలుతున్నాయి. భారత్లో రూ. 15 లక్షల ఆధాయం దాటితే 30 శాతం పన్ను చెల్లించాలి. ఐదు కోట్లు ధాటితే 37 శాతం పన్నుతో పాటు హెల్త్, విద్య కోసం అదనపు పన్ను చెల్లించాలి. సర్ఛార్జ్లతో కలుపుకొని మొత్తం 42 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
గుకేశ్కు రూ. 11.34 కోట్ల ప్రైజ్మనీతో పాటు మూడు మ్యాచ్లు గెలిచినందుకు రూ. 5.04 కోట్లు నగదు బహుమతి దక్కింది. దాంతోనే గుకేశ్ రూ. 4.67 కోట్ల పన్ను చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు.
మరోవైపు గుకేశ్ మాత్రం డబ్బుల కోసం తాను చెస్ ఆడటం లేదన్నాడు. చెస్ అంటే తనకు పిచ్చి అని తెలిపాడు. 'డబ్బుల కోసం నేను చెస్ ఆడటం లేదు. కానీ ఈ డబ్బు మాకు చాలా ఎక్కువ. నేను చెస్లోకి వచ్చినప్పుడు మా కుటుంబం ఆర్థికంగా, మానసికంగా ఇబ్బంది పడింది. ఈ ప్రైజ్మనీతో మేం సౌకర్యవంతంగా ఉంటాం. మరోసారి డబ్బుల గురించి ఆందోళన పడాల్సిన అవసరం ఉండదు.'అని గుకేశ్ చెప్పుకొచ్చాడు.