బుడాపెస్ట్: భారత జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి పసిడి పతకాన్ని అందుకున్నాడు.
హంగేరిలోని బుడాపెస్ట్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్స్లో భారత బళ్లెం వీరుడు.. జావెలిన్ను 88.17 మీటర్లు విసిరి అదరగొట్టాడు. ఈ గెలుపుతో వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ ఆటగాడిగా నీరజ్ చరిత్ర సృష్టించాడు.

ఈ టోర్నీ క్వాలిఫయర్స్లో తొలి ప్రయత్నంలోనే జావెలిన్ను 88.77 మీటర్ల దూరం విసిరి ఫైనల్కు అర్హత సాధించిన నీరజ్ చోప్రా.. ఫైనల్లో తొలి ప్రయత్నంలో విఫలమైనా.. రెండో ప్రయత్నంలో బళ్లెంను 88.17 మీటర్లు విసిరాడు. మూడో ప్రయత్నంలో జావెలిన్ను 86.32 మీటర్లు విసిరిన నీరజ్ చోప్రా.. నాలుగో ప్రయత్నంలో 84.64 మీటర్లు.. ఐదో ప్రయత్నంలో 87.73 మీటర్లు, ఆరో ప్రయత్నంలో 83.98 మీటర్లే విసిరాడు.
అత్యుత్తమ ప్రదర్శన 88.17 మీటర్లతో టాప్ ప్లేస్లో నిలిచి వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ గోల్డ్ మెడల్ సాధించాడు. గత వరల్డ్ అథ్లెటిక్స్లో నీరజ్ చోప్రా రజతం సాధించిన విషయం తెలిసిందే.
ఇక నీరజ్ చోప్రాతో పాటు ఫైనల్లో పోటీపడ్డ ఇతర భారత అథ్లెట్స్ కిషోర్ జెనా 84.77మీటర్లతో ఐదో స్థానంలో, డీపీ మను 84.14 మీటర్లతో ఆరోస్థానంలో నిలిచారు. పాకిస్థాన్ క్రీడాకారుడు అర్షద్ నదీమ్ 87.82 మీటర్లు విసిరి రజతం అందుకోగా.. చెక్ రిపబ్లిక్కు చెందిన జాకబ్ వడ్లెచ్ 86.67 మీటర్ల విసిరి బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నాడు.
మరోవైపు పురుషుల 4X400 మీటర్ల రిలే విభాగంలో భారత జట్టు 2.59.92 సెకన్లతో రేసును ముగించి ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ ఈవెంట్ను అగ్రరాజ్యం అమెరికా 2.57.31 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణం గెలుచుకుంది. ఇక మహిళల 3000 స్టీపుల్చేజ్ విభాగంలో భారత్ తరఫున పోటీపడిన పరుల్ చౌదరీ 11వ స్థానంలో నిలిచింది. ఇందులో పతకం రాకపోయినా.. ఆమె జాతీయ స్థాయి రికార్డు నమోదు చేసింది.