
యుజీనా(అమెరికా): వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో సంచలన ప్రదర్శనతో ఫైనల్ చేరిన భారత లాంగ్ జంప్ స్టార్ మురళీ శ్రీ శంకర్ తీవ్రంగా నిరాశపరిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో భారీ అంచనాల నడుమ బరిలోకి దిగిన శ్రీ శంకర్ ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. క్వాలిఫై రౌండ్లో కనబర్చిన ప్రదర్శనను కూడా ఇవ్వలేకపోయాడు. 7.96 మీటర్లు మాత్రమే జంప్ చేసి పతకాన్ని చేజార్చుకున్నాడు.
క్వాలిఫికేషన్ రౌండ్లో 8 మీటర్లు (రెండో ప్రయత్నం) దూకిన 23 ఏళ్ల మురళీ గ్రూప్-బిలో రెండో స్థానం.. మొత్తం మీద ఏడో స్థానంతో ముందంజ వేశాడు. ప్రపంచ అథ్లెటిక్స్లో లాంగ్జంప్లో పురుషుల విభాగంలో ఫైనల్ చేరిన తొలి భారత అథ్లెట్గా శ్రీశంకర్ ఘనత సాధించాడు. ఈ ఏప్రిల్లో ఫెడరేషన్ కప్లో 8.36 మీటర్లు దూకిన శ్రీశంకర్.. ఫైనల్లో ఆ స్థాయి ప్రదర్శన చేసినా పతకం గెలిచేవాడు. తద్వారా 19 ఏళ్ల రికార్డు అధిగమించే సువర్ణవకాశాన్ని శ్రీశంకర్ చేజార్చుకున్నాడు. ప్రపంచ అథ్లెటిక్స్లో భారత్కు లభించిన ఏకైక పతకం లాంగ్జంప్లోనే. 2003లో అంజుబాబి జార్జి కాంస్యం నెగ్గింది.
పురుషుల 3 వేల స్టీపుల్ఛేజ్లో అవినాష్ సాబ్లే ఫైనల్ చేరాడు. హీట్స్-3లో పోటీపడిన అతడు 8 నిమిషాల 18.75 సెకన్లలో లక్ష్యాన్ని చేరి మూడో స్థానంతో ముందంజ వేశాడు. మహిళల 3 వేల స్టీపుల్ చేజ్లో పారుల్ చౌదరి 12వ స్థానంతో సరిపెట్టుకుంది. ఆమె రికార్డు ప్రదర్శనను కూడా కనబర్చలేకపోయింది. 9.38.09 టైమింగ్తో ఫైనల్ బెర్త్ కోల్పోయింది. 400 మీటర్ల హర్డిల్స్ హీట్లో ఎంపీ జబీర్ నిష్క్రమించాడు. 50.76తో ఏడో స్థానంలో నిలిచాడు.
షాట్పుట్ స్టార్ తజిందర్పాల్ తూర్ పోటీకి దిగకుండానే గజ్జల్లో గాయంతో తప్పుకున్నాడు. నాలుగు రోజుల క్రితమే అతడికి ఈ గాయం కాగా.. నొప్పి తగ్గకపోవడంతో పోటీ నుంచి విరమించాడు. ఈ నెల 28న ఆరంభమయ్యే కామన్వెల్త్ క్రీడలకు కూడా అతడు దూరమయ్యాడు.