హంగేరీ: భారత బళ్లెం వీరుడు, ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా సంచలన ప్రదర్శన చేశాడు. హంగేరీ వేదికగా జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ క్వాలిఫయర్స్ తొలి ప్రయత్నంలోనే ఈ సీజన్ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. క్వాలిఫయింగ్ గ్రూప్-ఏలో పోటీపడిన నీరజ్ చోప్రా జావెలిన్ను 88.77 మీటర్ల దూరం విసిరి ఫైనల్కు అర్హత సాధించాడు.

ఫైనల్ కటాఫ్ మార్క్ 83 మీటర్లే కాగా.. నీరజ్ చోప్రా మరో 5.77 మీటర్లు ఎక్కువే విసిరి ఫైనల్కు దూసుకెళ్లాడు. ఆదివారం జావెలిన్ త్రో ఫైనల్ పోటీలు జరగనున్నాయి. ఈ ప్రదర్శనతో నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించాడు. భారత్కే చెందిన మరో జావెలిన్ త్రో ప్లేయర్ మను తొలి రౌండ్లో 78.10 మీటర్లు విసరగా.. రెండో ప్రయత్నంలో 81.31 మీటర్లే విసిరాడు. మూడో ప్రయత్నంలో 72.40 మీటర్లకే పరిమితమయ్యాడు.
గతేడాది జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ సాధించాడు. లాంగ్ జంపర్ అంజు బాబి జార్జ్ తర్వాత ఈ ఘనతను అందుకున్న భారత అథ్లెట్గా నిలిచాడు. 2003 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అంజు బాబీ జార్జ్ సిల్వర్ మెడల్ సాధించింది.
గతేడాది 88.13 మీటర్ల దూరం విసిరిన నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచాడు. గ్రెనెడాకు చెందిన అండర్సన్ పీటర్స్ 90.54 మీటర్లు విసిరి స్వర్ణ పతకం దక్కించుకున్నాడు. టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా స్వర్ణం సాధించి గోల్డెన్ బాయ్గా మారాడు. 2018లో ఆసియా క్రీడల్లో స్వర్ణం, 2018లో కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణం, 2022లో ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో రజతం పతకాలు సాధించాడు.