
యుగన్: వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్, గోల్డెన్ భాయ్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. అమెరికా వేదికగా జరుగుతున్న ఈ మెగాఈవెంట్లో సిల్వర్ మెడల్తో సత్తా చాటాడు. ఆదివారం జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ ఈటెను 88.13 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచాడు. తద్వార 19 ఏళ్ల భారత నిరీక్షణకు తెరదించాడు.
దాంతో వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో పతకం సాధించిన రెండో భారత అథ్లెట్గా.. తొలి జావెలిన్ త్రోయర్గా చరిత్రకెక్కాడు. అప్పుడెప్పుడో 19 ఏళ్ల క్రితం అంజు బాబీ జార్జ్ బ్రాంజ్ మెడల్ గెలవగా.. మళ్లీ ఇన్నాళ్లకు నీరజ్ చోప్రా భారత్కు పతకాన్ని అందించాడు. 2003 పారిస్ చాంపియన్షిప్లో లాంగ్ జంప్ ఈవెంట్లో అంజు బాబీ జార్జ్ మెడల్ గెలిచింది.
తొలి ప్రయత్నంలో ఫౌల్ చేసిన నీరజ్ చోప్రా.. రెండో ప్రయత్నంలో ఈటెను 82.39 మీటర్లు మాత్రమే విసిరాడు. ఇక మూడో ప్రయత్నంలో 86.37 విసిరిన ఒలింపిక్ గోల్డెన్ బాయ్ నాలుగో ప్రయత్నంలో 88.13 మీటర్లు విసిరి టాప్-2లోకి దూసుకెళ్లాడు. అయితే కీలకమైన ఐదో ప్రయత్నంలో మళ్లీ ఫౌల్ చేశాడు. చివరి ప్రయత్నంలోనూ తడబడ్డ నీరజ్ చోప్రా ఫౌల్ చేశాడు. ఇక అంతా ఊహించనట్లుగా మాజీ చాంపియన్, గ్రెనెడా అథ్లెట్ అండర్సన్ పీటర్సన్ 90.54 మీటర్లతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. చెక్ రిపబ్లిక్కు చెందిన జాకుబ్ వాద్లెచ్(88.09 మీటర్లు)తో బ్రాంజ్ మెడల్ గెలిచాడు.
మరో భారత జావెలిన్ త్రోయర్ రోహిత్ యాదవ్ 78.72 మీటర్లతో 10 స్థానంలో నిలిచాడు. పాకిస్థాన్కు చెందిన అర్షద్ నదీమ్ (86.16 మీటర్లు) ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఇక ట్రిపుల్ జంప్ ఈవెంట్ ఫైనల్ చేరి ఆశలు రేపిన భారత అథ్లెట్ ఎల్డోస్ పాల్ 9వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. 16.79 మీటర్లు మాత్రమే దూకిన ఎల్డోస్ పాల్ పతకం సాధించడంలో విఫలమయ్యాడు. పోర్చగల్కు చెందిన పెడ్రో పికార్డో 17.95 మీటర్లతో గోల్డ్ మెడల్ సాధించగా.. జాంగో(బుర్కినో ఫాసో) 17.55 మీటర్లతో సిల్వర్, చైనాకు చెందిన యామింగ్ జూ 17.31 మీటర్లు బ్రాంజ్ మెడల్ గెలిచాడు. భారత పురుషుల 4X400 మీటర్ల రిలే టీమ్ చివరి స్థానంలో నిలిచి టోర్నీ నుంచి నిష్క్రమించింది.