భారత్కు ఖాయమైన ఫిడే మహిళల చెస్ వరల్డ్ కప్ టైటిల్ను తమ పరం చేసుకునేందుకు తెలుగు తేజం కోనేరు హంపి, దివ్య దేశ్ముఖ్ హోరాహోరీగా తలపడుతున్నారు. తొలి గేమ్ను 41 ఎత్తుల్లో డ్రా చేసుకున్న ఈ భారత స్టార్లు.. ఆదివారం జరిగిన రెండో గేమ్ను కూడా డ్రా చేశారు. దాంతో ఫలితం తేల్చేందుకు సోమవారం టై బ్రేకర్ ఆడించనున్నారు. తొలి గేమ్లో నల్ల పావులతో ఆడిన కోనేరు హంపి.. ఇవాళ తెల్ల పావులతో బరిలోకి దిగింది. తొలి గేమ్ తరహాలోనే ఈ మ్యాచ్ కూడా హోరా హోరీగా సాగింది. 41 ఎత్తుల తర్వాత ఫలితం వచ్చే అవకాశం లేకపోవడంతో ఇద్దరూ డ్రాకు మొగ్గు చూపారు.
గేమ్ ప్రారంభంలో దివ్య దేశ్ముఖ్ క్వీన్స్ గాంబిట్ ఓపెనింగ్తో దూకుడు కనబర్చింది. 14వ ఎత్తులో బిషప్ను త్యాగం చేయడం ద్వారా ఆమె అడ్వాంటేజ్ పొందింది. ఇక్కడ దివ్యకు గేమ్ గెలిచే అవకాశం లభించినప్పటికీ సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఆరంభంలో ఇబ్బంది పడిన హంపి 16వ ఎత్తు నుంచి పుంజుకుంది.

ఇద్దరు ఆటగాళ్లు ఒత్తిడిని అధిగమించి తెలివిగా ఆడారు. 37వ ఎత్తులో దివ్య దేశ్ముఖ్.. హంపి యొక్క రూక్ను గెలుచుకుంది. అయితే హంపి పట్టుదలతో ఆడి, 41వ ఎత్తులో పర్పెచువల్ చెక్స్ సాయంతో గేమ్ను డ్రా అయ్యేలా చేసుకుంది. చివరి గేమ్ సాగే కొద్దీ ఫలితం తేలే అవకాశాలు లేకపోవడంతో దాదాపు మూడు గంటలపాటు జరిగిన ఈ గేమ్ 41వ ఎత్తులో డ్రా అయ్యింది.
రెండు క్లాసికల్ గేమ్లు డ్రా కావడంతో.. విజేతను నిర్ణయించేందుకు సోమవారం రాపిడ్, బ్లిట్జ్ ఫార్మాట్లో టై-బ్రేకర్ మ్యాచ్లు నిర్వహిస్తారు. ఇందులో గెలిచే వారికే ఫిడే వుమెన్స్ వరల్డ్ కప్ టైటిల్ దక్కుతుంది.