భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్కు కోర్ట్ ఆఫ్ అర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్(CAS)లో ఎదురుదెబ్బ తగిలింది. రజత పతకం ఇవ్వాలని ఆమె చేసిన అప్పీల్ను కాస్ కొట్టేసింది. వినేష్ ఫోగట్ పిటిషన్ను తిరస్కరిస్తున్నట్లు అడహక్ డివిజన్ సోల్ ఆర్బిట్రేటర్ అనబెల్ బెనెట్ బుధవారం తీర్పునిచ్చారు. ఇప్పటికే ఈ తీర్పుపై భారత ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) అసంతృప్తిని వ్యక్తం చేసింది. వినేశ్కు మద్దతుగా ఉంటామని ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష భరోసా ఇచ్చారు.
అయితే కాస్లో అనుకూలంగా తీర్పు రానప్పుడు.. దానిని సవాల్ చేసే అవకాశం ఉందా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే అలాంటి అవకాశం ఉందని క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్(యూడబ్ల్యూడబ్ల్యూ) నిర్ణయాలకు అనుగుణంగా కాస్ తీర్పు ఇచ్చింది. దీనిని సవాల్ చేసే అవకాశం ఉంది. కానీ, చాలా తక్కువ అంశాల్లో మాత్రమే ఈ అవకాశం ఉందని సమాచారం.
'స్విస్ ఫెడరల్ ట్రెబ్యునల్ ఇచ్చిన తీర్పును న్యాయపరంగా సవాల్ చేసేందుకు అవకాశం ఉంది. అయితే ఇందుకు కొన్ని పరిమితులు ఉంటాయి. ప్రాథమిక విచారణ నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలడం, పబ్లిక్ పాలసీలో అననుకూలత వంటి కారణాలకు మాత్రమే అనుమతి ఉంటుంది.'అని కాస్ తన వెబ్సైట్లో పేర్కొంది.
కాస్ తీర్పు నేపథ్యంలో వినేష్ ఫోగట్కు మద్దతుగా ఉంటామని ఐఓఏ ప్రకటించింది. తదుపరి న్యాయపరమైన అవకాశాలపై దృష్టిసారించామని, క్రీడల్లో పారదర్శకతతో పాటు అథ్లెట్లకు న్యాయం జరగాలనేదే తమ అభిమతమని తెలిపింది. వారి హక్కుల కోసం చివరి వరకూ పోరాడుతామని వెల్లడించింది.
పారిస్ ఒలింపిక్స్ 2024లో మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో పోటీ పడిన వినేష్ ఫోగట్.. అసాధారణ ప్రదర్శనతో ఫైనల్ చేరి రజత పతకం ఖాయం చేసుకుంది. కానీ చివరి నిమిషంలో100 గ్రాముల అధిక బరువుతో అనర్హత వేటుకు గురైంది. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్(యుడబ్ల్యూడబ్ల్యూ) రూల్స్ ప్రకారం.. డిస్క్వాలిఫై అయిన రెజ్లర్కు ఫైనల్ చేరినా చివరి ర్యాంక్ ఇస్తారు. దాంతో ఆమెకు ఏ పతకం రాకుండా పోయింది.