భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. జులానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వినేష్ ఫోగట్.. బీజేపీ అభ్యర్థి యోగేశ్ కుమార్పై గెలుపొందారు. యోగేశ్ కుమార్ రెండో స్థానంలో నిలవగా..ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అభ్యర్థి సురేందర్ లాథర్ మూడో స్థానంలో నిలిచారు.
పారిస్ ఒలింపిక్స్ 2024లో 100 గ్రాముల అధిక బరువుతో అనర్హత వేటుకు గురైన వినేష్ ఫోగట్.. కెరీర్కు వీడ్కోలు పలికి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఒలింపిక్స్లో మహిళల రెజ్లింగ్ 48 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో పోటీ పడిన వినేష్ ఫోగట్ అసాధారణ ప్రదర్శనతో ఫైనల్ చేరి రజతం ఖాయం చేసుకుంది. కానీ తుది పోరుకు ముందు ఆమె నిర్ణీత బరువు కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉండటంతో టోర్నీ నిబంధనల ప్రకారం డిస్క్వాలిఫై చేశారు.

దాంతో ఆమెకు ఎలాంటి పతకం రాకుడా పోయింది. ఫైనల్ చేరిన తనకు కనీసం రజత పతకమైనా ఇవ్వాలని చేసిన న్యాయపోరాటం ఫలించలేదు. దాంతో ఒలింపిక్ మెడల్ సాధించాలనే ఆమె కల నెరవేరలేదు. ఒలింపిక్స్ ముగిసిన వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరిన వినేష్ ఫోగట్.. ప్రస్తుతం ఎమ్మెల్యేగా గెలుపొందారు.
అయితే గతేడాదిగా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) మాజీ ప్రెసిడెంట్ బ్రిజ్భూషణ్ చరణ్ సింగ్కు వ్యతిరేకంగా భారత మహిళా రెజ్లర్లు ఢిల్లీ నడి వీధుల్లో చేపట్టిన ఆందోళనల్లో వినేష్ ఫోగట్ చురుగ్గా పాల్గొన్నారు. కొత్త పార్లమెంట్ భవనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల చేతుల దెబ్బలు తిన్నారు. చివరకు తాము సాధించిన పతకాలను గంగలో వేసేందుకు కూడా సిద్దమయ్యారు.
మహిళల రెజ్లర్ల నిరసనకు తలొగ్గిన ప్రభుత్వం బ్రిజ్భూషణ్ చరణ్ సింగ్ను డబ్ల్యూఎఫ్ఐ ప్రెసిడెంట్ పదవి నుంచి తొలగించింది. కానీ అతని సన్నిహితుడే మళ్లీ రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడయ్యాడు. కాంగ్రెస్ కుట్రలో భాగంగానే వినేష్ ఫోగట్ ఆందోళన చేపట్టిందని బీజేపీ ఆరోపించినా.. ఆమె విజయాన్ని అడ్డుకోలేకపోయాయి.