ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉషపై భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ సంచలన వ్యాఖ్యలు చేసారు. పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత ఒలింపిక్ సంఘంతో పాటు పీటీ ఉష తనకు సాయం చేయలేదన్నారు. ఫొటోలు దిగుతూ సోషల్ మీడియా వేదికగా వాటిని షేర్ చేసుకొని మద్దతుగా నిలిచామని చెప్పుకున్నారని పేర్కొన్నారు.
పారిస్ ఒలింపిక్స్ 2024లో వినేష్ ఫోగట్పై అనర్హతవేటు పడిన విషయం తెలిసిందే. మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ కేటగిరీలో అసాధారణ ప్రదర్శనతో ఫైనల్ చేరిన వినేష్ ఫోగట్.. 100 గ్రాముల అధిక బరువుతో డిస్ క్వాలిఫై అయ్యారు. దాంతో ఆమెకు ఏ పతకం రాలేదు. తనకు కనీసం రజత పతకమైనా ఇవ్వాలని వినేష్ ఫోగట్ కోర్టు ఆఫ్ ఆర్భిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్(కాస్)ను సంప్రదించగా.. అనేక వాయిదాల తర్వాత ప్రతికూల తీర్పే వచ్చింది.

అయితే ఈ కేసు విషయంలో భారత ఒలింపిక్ సంఘం నుంచి తనకు ఎలాంటి మద్దతు లభించలేదని తాజాగా వినేష్ ఫోగట్ అన్నారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. 'పీటీ ఉష మేడమ్ నన్ను చూడటానికి ఆసుపత్రికి వచ్చారు. ఒక ఫోటో తీసుకున్నారు. రాజకీయాల్లో ఇవన్నీ సహజమే.
పారిస్ ఒలింపిక్ విలేజ్లో కూడా రాజకీయాలు నడిచాయి. అందుకే నా మనసు విరిగింది. రెజ్లింగ్ను వదిలేయవద్దని చాలా మంది నాకు చెబుతున్నా.. కొనసాగడం వల్ల నాకు జరిగే ప్రయోజనం ఏంది? అక్కడ ప్రతీది రాజకీయమే. ఆసుపత్రిలో ఉండగా ఓ వ్యక్తి వచ్చి నాతో ఫొటో దిగి నాకు అండగా ఉన్నానని ప్రచారం చేసుకోవడం సరైందేనా..?
నిజానికి నాకు మద్దతు పలుకుతున్నట్లు నటించారు. మెడల్ కోసం నా తరఫున భారత ఒలింపిక్ అసోసియేషన్ పిటిషన్ వేయాలి. కానీ నాకు ఎవరూ అండగా లేకపోవడంతో నేను పోరాటం చేశాను. మేమంతా దేశం కోసం ప్రాతినిథ్యం వహిస్తున్నప్పుడు ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున మద్దతు దక్కాల్సింది. కానీ, వారంతా మీడియాకు బైట్లు ఇచ్చే బిజీలో ఉండిపోయారు. దీంతో థర్డ్ పార్టీగానే మేం వాదనలు వినిపించాం.'అని వినేశ్ ఫోగట్ చెప్పుకొచ్చారు.