భారత మహిళా రెజ్లర్ల ఉద్యమంపై స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ చేసిన సంచలన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ రెజ్లర్ వినేష్ ఫోగట్ తోసిపుచ్చింది. అవి సాక్షి మాలిక్ వ్యక్తిగత అభిప్రాయమని, రెజ్లర్ల ఉద్యమం బలహీనం కాదని స్పష్టం చేసింది.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్కు వ్యతిరేకంగా స్టార్ రెజ్లర్లు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. రెజ్లర్ల ఉద్యమం తర్వాతే బ్రిజ్భూషణ్పై కేసు నమోదుకాగా..దానిపై ఢిల్లీ హైకోర్టులో ప్రస్తుతం విచారణ జరుగుతోంది.

అయితే ఆసియా క్రీడల ట్రయల్స్ నుంచి మినహాయింపు కోరుతూ వినేశ్ ఫోగట్, బజరంగ్ పూనియాలు డబ్ల్యూఎఫ్ఐని అభ్యర్థించడం తమ ఆందోళనను బలహీన పరిచిందని సాక్షి మాలిక్ అభిప్రాయపడింది. వ్యక్తిగత లబ్ధికోసం ఉద్యమం చేశారన్న అప్రతిష్ఠ ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. తన ఆటోబయోగ్రఫీ 'విట్న్స్'లో సాక్షి మాలిక్ రెజ్లర్ల ఉద్యమంపై తన అభిప్రాయాలను నిక్కచ్చిగా వెల్లడించింది.
'స్వార్థ పూరితంగా ఆలోచన కారణంగా ఉద్యమం బలహీనపడింది. బజ్రంగ్ పూనియా, వినేష్ ఫోగట్ మనసులలో వారి సన్నిహితులు దురాశను నూరి పోశారు. దాంతో 2023 ఆసియా గేమ్స్ ట్రయల్స్ నుంచి మినహాయింపు పొందే అంశాన్ని వారిద్దరూ లేవనెత్తారు. ఉద్యమ సమయంలో.. బబితా ఫొగట్ స్వార్థపూరిత ఆలోచన చేసింది.
ఉద్యమానికి తాను మద్దతు పలుకుతున్నట్టు ప్రకటించడం వెనుక బ్రిజ్భూషణ్ స్థానంలో డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ పదవి చేపట్టాలనే దురాలోచన ఉన్నది.'అని సాక్షి మాలిక్ తన పుస్తకంలో రాసుకొచ్చింది.
ఈ వ్యాఖ్యలపై స్పందించిన వినేష్ ఫోగట్.. రెజ్లర్ల పోరాటం ఎప్పటికీ బలహీనం కాదని స్పష్టం చేసింది. 'సాక్షి మాలిక్ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగత అభిప్రాయం. ఆమె వ్యాఖ్యలను ఏ మాత్రం అంగీకరించను. నేను బలహీనంగా ఉన్నంత మాత్రానా పోరాటం బలహీనం కాదు. అది నా నమ్మకం. సాక్షి, వినేష్, బజరంగ్ పునియా బతికున్నంతకాలం.. ఆ పోరాటం బలహీనపడదు. గెలవాలని అనుకునేవారు ఎప్పటికీ బలహీనులు కాకూడదు. పోరాటాన్నే ఎంచుకున్నప్పుడు ఎన్ని అడ్డుంకులు ఎదురైనా ముందుకు సాగాల్సిందే'అని వినేష్ ఫోగట్ చెప్పుకొచ్చింది.