భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ తన క్రీడా పురస్కారాలను న్యూఢిల్లీలోని ప్రధాన మంత్రి కార్యలయం సమీపంలో వదిలేసింది. ప్రధాన మంత్రి కార్యలయంలోకి వెళ్లేందుకు ఆమె ప్రయత్నించగా.. కర్తవ్య పథ్ వద్ద పోలీసులు అడ్డగించారు. దీంతో వినేష్ ఫోగట్ తన అవార్డులను అక్కడే ఖాళీ స్థలంలో వదిలేశారు.
డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమను లైంగికంగా వేధించాడని భారత మహిళా రెజ్లర్లు గత ఏడాదిగా నిరసనలు చేస్తున్నారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో తమ ఆందోళనలను విరమించారు. అయితే తాజాగా జరిగిన డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ అధ్యక్షుడిగా ఎన్నికవడంతో రెజ్లర్లు మళ్లీ నిరసన బాట పట్టారు.

దేశంలో మహిళా రెజ్లర్లకు న్యాయం జరగడం లేదని అసంతృప్తిని వ్యక్తం చేసిన వినేశ్ ఫొగాట్.. భారత ప్రభుత్వం తన ప్రతిభకు గుర్తింపుగా అందించిన అర్జున, ఖేల్రత్న అవార్డులను తిరిగి ఇచ్చేస్తానని ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది.
'నేను మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న, అర్జున అవార్డులను భారత ప్రభుత్వం నుంచి అందుకున్నాను. ప్రస్తుతం వాటిని నా జీవితంలో ఉంచుకోవడంలో ఏ మాత్రం అర్థం లేదు. ప్రతి మహిళ తన జీవితాన్ని గౌరవంగా జీవించాలని కోరుకుంటుంది. ఈ క్రమంలోనే నేను నా మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న, అర్జున అవార్డులను వెనక్కి ఇచ్చేయాలని అనుకుంటున్నాను.
ఇకపై మేం గౌరవంగా జీవించాలనుకునే జీవితంలో ఈ అవార్డులు నాకు భారం కాబోవు.' అని వినేష్ ఫోగట్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ లేఖను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ క్రమంలోనే శనివారం వినేష్ ఫోగట్ తన పురస్కారాలను ప్రధాన మంత్రి కార్యలయంలోకి వెళ్లి ఇచ్చేందుకు ప్రయత్నించింది.
కానీ పోలీసులు అడ్డుకోవడంతో ప్రధాని కార్యాలయానికి సమీపంలోనే వదిలేసింది. ఇప్పటికే సంజయ్ సింగ్ ఎన్నికను నిరసిస్తూ.. సాక్షి మాలిక్ తన రెజ్లింగ్ కెరీర్కు గుడ్బై ప్రకటించింది. తన నిర్ణయాన్ని వెల్లడిస్తూ మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమైంది. బజరంగ్ పూనియా సైతం.. ప్రధాని నరేంద్ర మోదీ మాట తప్పారని, బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ అనుచరులు కూడా డబ్ల్యూఎఫ్ఐలోకి రాకుండే చేస్తానని హామీ ఇచ్చి మరిచిపోయారని ఆవేదన వ్యక్తం చేశాడు.
తన పద్మశ్రీ అవార్డును ప్రధాని కార్యలయం ముందు వదిలేసారు. గతంలో 40 రోజుల పాటు తీవ్రంగా ఉద్యమం చేశామని దాన్ని బ్రిజ్ భూషణ్ తన పలుకుబడితో అణిచివేశారని ప్రధానిని ఉద్దేశిస్తూ బజ్ రంగ్ పునియా లేఖను షేర్ చేశాడు.