పారిస్ ఒలింపిక్స్ 2024లో అనర్హత వేటుకు గురైన భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ సిల్వర్ మెడల్ కోసం కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్(CAS)ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై శుక్రవారం విచారణ జరగా.. వినేష్ ఫోగట్ తరఫున భారత ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) నియమించిన ప్రముఖ న్యాయవాదులు హారీశ్ సాల్వే, విదుష్పత్ సింఘానియా తమ వాదనలు వినిపించారు.
దీనిపై నిర్ణయాన్ని కాస్ అడ్ హక్ డివిజన్ శనివారం రాత్రి 9.30 గంటలకు వెల్లడించనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ కేసు తీర్పును అడ్ హక్ డివిజన్ ఆగస్ట్ 13కి వాయిదా వేసింది.

'ఒలింపిక్స్ సంబంధించి కాస్త మధ్యవర్తిత్వ నిబంధనల్లోని ఆర్టికల్ 18 ప్రకారం అడ్హక్ డివిజన్ అధ్యక్షుడు నిర్ణయం తీసుకోవడానికి ప్యానల్కు కాల పరిమితి ఆగస్ట్ 13వ రకు పొడిగించారు.'అని కాస్ ఓ ప్రకటనలో పేర్కొంది.
మహిళల 53 కేజీల ప్రీస్టైల్ రెజ్లింగ్ ఈవెంట్లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన వినేష్ ఫోగట్.. 100 గ్రాముల ఎక్కువ బరువు ఉందనే కారణంతో అనర్హతకు గురైంది. ఈ ఊహించని పరిణామంతో గోల్డ్ మెడల్ సాధించాలనుకున్న వినేష్ ఫోగట్కు ఏ పతకం లేకుండా పోయింది. ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య రూల్స్ ప్రకారం డిస్క్వాలిఫై అయిన రెజ్లర్కు చివరి ర్యాంక్ కేటాయించి ఏ పతకం ఇవ్వరు. దాంతో వినేష్ ఫోగట్కు కనీస రజత పతకం కూడా గెలిచే అవకాశం దక్కలేదు.
అయితే ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఇండియన్ ఒలింపిక్ సంఘం.. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్(CAS)ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారమే ఆడి ఫైనల్ చేరిన వినేష్ ఫోగట్కు కనీసం రజత పతకమైనా ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరింది. వినేష్ ఫోగట్కు అనుకూలమైన తీర్పు వస్తే.. ఆమెకు సిల్వర్ మెడల్ దక్కనుంది.
ఇక వినేష్ ఫోగట్ వ్యవహారంపై ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాక్ స్పందించిన విషయం తెలిసిందే. ఆమె పరిస్థితిని తాను అర్థం చేసుకోగలనని, అయితే చిన్న చిన్న మినహాయింపులు ఇవ్వడాన్ని ఎక్కడ ఆపాలన్నది పెద్ద ప్రశ్నని ఆయన అభిప్రాయపడ్డాడు.