భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ పెరిగిన బరువును తగ్గించే క్రమంలో చనిపోతుందేమోననే భయం వేసిందని ఆమె పర్సనల్ కోచ్ వోలర్ అకోస్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. పారిస్ ఒలింపిక్స్ 2024లో వినేష్ ఫోగట్ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు.
మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్లో పోటీపడిన వినేష్ ఫోగట్ అసాధారణ ప్రదర్శనతో ఫైనల్ చేరి రజత పతకం ఖాయం చేసుకుంది. కానీ చివరి క్షణంలో 100 గ్రాముల అధిక బరువుతో అనర్హత వేటు గురైంది. దాంతో ఆమెకు ఏ పతకం రాలేదు. తుది పోరుకు అర్హత సాధంచే క్రమంలో తాను ఎలాంటి తప్పిదం చేయలేదని, సంయుక్త రజత పతకం ఇవ్వాలని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్లో అప్పీల్ చేసింది. కానీ.. ఆమె అభ్యర్థనను తిరస్కరించింది. ఈ క్రమంలోనే వినేష్ ఫోగట్ కోచ్ సోషల్ మీడియా వేదికగా ఓ భావోద్వేగపూరితమైన పోస్ట్ను పంచుకున్నాడు.

'సెమీఫైనల్ తర్వాత వినేష్ ఫోగట్ 2.7 కిలోల అధిక బరువు ఉన్నట్లు గుర్తించాం. గంటా ఇరవై నిమిషాల వ్యాయమం తర్వాత కూడా మరో కిలోన్నర బరువు అధికంగా ఉంది. దాంతో మేం మరో యాభై నిమిషాల పాటు వ్యాయామం చేయించాం. ఆమె నిర్ణీత బరువకు రావడమే లక్ష్యంగా అర్థరాత్రి నుంచి తెల్లవారు జామున 5.30 గంటల వరకు వర్కౌట్స్ చేయించాం. గంట గంటకు కేవలం రెండు, మూడు నిమిషాల విశ్రాంతి మాత్రమే తీసుకుంది. ఆ తర్వాత మళ్లీ కసరత్తులు చేసింది. ఫలితంగా ఆమె కుప్పకూలిపోయింది. ఆ తర్వాత మళ్లీ గంటపాటు వ్యాయామం చేసింది.
నేనేదో ఆమె కష్టం గురించి చెప్పడానికి ఈ పోస్ట్ పెట్టడం లేదు. తనను చూస్తే ఆరోజు నిజయం భయం వేసింది. ఒకానొక దశలో చనిపోతుందేమోననే ఆందోళన కలిగింది.'అని వినేష్ ఫోగట్ కోచ్ సుదీర్ఘ పోస్ట్లో పేర్కొన్నాడు.