న్యూఢిల్లీ: కర్ణాటక సంప్రదాయ క్రీడ 'కంబళ'లో సరికొత్త రికార్డు సృష్టించిన నిశాంత్ శెట్టిని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్విటర్ వేదికగా అభినందించారు. వివిధ భాషల్లో వరుస ట్వీట్లతో ప్రశంసల జల్లు కురిపించారు.
'కన్నడ గ్రామీణ క్రీడ 'కంబళ' క్రీడలో సరికొత్త రికార్డును నమోదుచేసిన శ్రీ నిశాంత్శెట్టికి అభినందనలు. 143 మీటర్ల దూరాన్ని 13.62 సెకన్లలో చేరుకుని ఇటీవల ఇదే దూరాన్ని 13.68 సెకన్లలో పూర్తిచేసిన శ్రీనివాస గౌడ కన్నా 0.06 సెకన్ల ముందే లక్ష్యాన్ని చేరడం ప్రశంసనీయం. భారత యువతలో దాగిన ఇలాంటి అపారమైన నైపుణ్యాన్ని గుర్తించి తగిన శిక్షణనిచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలి. అంతర్జాతీయంగా క్రీడల్లో భారతదేశానికి పేరుప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను'అని ట్వీట్ చేశారు.
భారత యువతలో దాగి ఇలాంటి అపారమైన నైపుణ్యాన్ని గుర్తించి తగిన శిక్షణనిచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలి. అంతర్జాతీయంగా క్రీడల్లో భారతదేశానికి పేరుప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను. #Kambala #sports #NishantShetty
— Vice President of India (@VPSecretariat) February 19, 2020
భారత బోల్ట్ శ్రీనివాస గౌడను మించిన మరో కంబాల రన్నర్.!!
ఇటీవల పరుగుల చిరుత, జమైకా వీరుడు ఉసేన్ బోల్ట్ రికార్డును కర్ణాటకకే చెందిన శ్రీనివాస గౌడ కంబళ పోటీల్లో బ్రేక్ చేశాడని యావత్ భారత్ అతన్ని కొనియాడిన విషయం తెలిసిందే. దీంతో అతను రాత్రికి రాత్రే స్టార్ అయ్యాడు. కంబళ పోటీలో అతను తన దున్నలతో 142.4 మీటర్ల దూరాన్ని 13.42 సెకన్లలో పూర్తి చేశాడని, ఈ లెక్కన 100 మీటర్ల దూరాన్ని శ్రీనివాస్ 9.55 సెకన్లలో పరుగెత్తాడని అతనిపై ప్రశంసల జల్లు కురిపించారు.
తాజాగా ఇదే కంబళ పోటీల్లో నిశాంత్ శెట్టి అనే యువకుడు తన జోడెద్దులతో 143 మీటర్లను 13.68 సెకన్లలోనే పూర్తి చేశాడు. ఈ లెక్కన 100 మీటర్లను 9.51 సెకన్లలోనే పూర్తి చేసినట్టు. అంటే శ్రీనివాస్ గౌడ కన్న ఇది 0.04 సెకన్లు తక్కువ. పరుగుల చిరుత ఉసెన్ బోల్ట్ కన్నా 0.07 సెకన్లు తక్కువ. కర్ణాటకలోని బజ్గోలి జోగిబెట్టుకు చెందిన నిషాంత్ షెట్టి.. వెనూర్ వేదికగా జరిగిన సూర్య-చంద్ర జోడుకరే కంబాల పోటీల్లో ఈ నయా రికార్డు సృష్టించాడు.