టీమిండియా మాజీ కెప్టెన్, ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీనే తనకు స్ఫూర్తి అని యూపీఎస్సీ టాపర్ అనన్య రెడ్డి తెలిపారు. అఖిల భారత సర్వీసుల్లో నియామకాలకు నిర్వహించిన సివిల్స్లో అనన్య రెడ్డి సత్తాచాటారు. జాతీయ స్థాయిలో మూడో ర్యాంక్ సాధించారు. తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామానికి చెందిన దోనూరు అనన్యరెడ్డి స్వీయ సన్నద్ధతతో తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీ టాప్ ర్యాంక్ సాధించారు.
ఈ క్రమంలో ఆమెను ఓ తెలుగు ఛానెల్ ఇంటర్వ్యూ చేయగా తనకు విరాట్ కోహ్లీనే అతిపెద్ద స్ఫూర్తి అని తెలిపారు. 'నా ఫేవరేట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ. ఆయనే నాకు స్ఫూర్తి. ఆయన లైఫ్ స్టైల్ నాకు ఎంతో ఇష్టం. ఫలితంతో సంబంధం లేకుండా మన ప్రయత్నం మనం చేయాలనే విషయాన్ని కోహ్లీ నుంచే నేర్చుకున్నా.

పరిస్థితులతో సంబంధం లేకుండా పోరాడే తత్వాన్ని, క్రమ శిక్షణను ఆయనను చూసే అలవర్చుకున్నాను.'అని అనన్య రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఈ వీడియో పట్ల కోహ్లీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీ గురించి క్రికెటర్లు, సినిమా స్టార్స్ మాట్లాడటం చూశామని, కానీ సివిల్ టాపర్ కూడా కోహ్లీ స్ఫూర్తితోనే ర్యాంక్ సాధించానని చెప్పడం సంతోషంగా ఉందని కామెంట్ చేస్తున్నారు.
కోహ్లీ క్రికెటర్లే కాకుండా ఈ దేశంలో ఎంతో మందికి స్ఫూర్తి కలిగించే దిగ్గజమని కొనియాడుతున్నారు. క్రమశిక్షణ, పట్టువదలని ప్రవర్తన, పోరాడే తత్వం కోహ్లీని చూసి నేర్చుకోవచ్చని కామెంట్ చేస్తున్నారు.
ఇక, కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన నందాల సాయికిరణ్ 27, కేఎన్ చందన జాహ్నవి 50, జనగామ జిల్లా యువకుడు మెరుగు కౌశిక్ 82వ ర్యాంకులు సాధించారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మంగళవారం విడుదల చేసిన సివిల్స్-23 తుది ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి 40 మందిపైగా అభ్యర్థులు ఎంపికయ్యారు.