
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ 2020లో గతేడాదితో పోలిస్తే క్రీడలకు కేటాయింపులు కొంచెం పెరిగాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను క్రీడల కోసం రూ. 2826.92 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. గత బడ్జెట్ కంటే యాభై కోట్లు అదనంగా ఇచ్చింది.
ఇక కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఖేలో ఇండియా గేమ్స్ నిధులు ఏకంగా 312.42 కోట్లు పెంచింది. గతేడాది బడ్జెట్లో ఖేలో ఇండియా గేమ్స్కు రూ.578 కోట్లు మాత్రమే ఇచ్చిన ప్రభుత్వం శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన సెంట్రల్ బడ్జెట్లో రూ. 890.42 కోట్లు కేటాయించింది. దీంతో ఒలింపిక్ ఏడాదిలో మిగతా విభాగాల కేటాయింపుల్లో కోత పడింది.
వాటిలో నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్లకు ఇచ్చే మొత్తం భారీగా తగ్గింది. గతేడాది కంటే రూ.55 కోట్లు తగ్గిస్తూ ఫెడరేషన్స్కు ఈసారి రూ. 245 కోట్లనే కేటాయించింది. నేషనల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఫండ్ను రూ. 77.15 కోట్ల నుంచి రూ.50 కోట్లకు తగ్గించింది.
అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్)కు ఈసారి రూ.500 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం రూ. 115 కోట్లు కోత పెట్టింది. క్రీడాకారుల నేషనల్ వెల్ఫేర్ ఫండ్ రూ. 2 కోట్లలో మాత్రం ఏలాంటి కోత విధంచలేదు. పెంచలేదు. కాగా, 2019-20 బడ్జెట్లో తొలుతు స్పోర్ట్స్కు రూ.2216.92 కోట్లు కేటాయించగా.. తర్వాత దాన్ని 2776.92 కోట్లకు పెంచింది.