
పుణే: అల్టిమేట్ ఖో ఖో సీజన్ ఆరంభంలో తెలుగు యోధాస్ టీమ్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ముంబై ఖిలాడీస్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో తెలుగు యోధాస్ 12 పాయింట్ల తేడాతో అద్భుత విజయాన్నందుకుంది. అద్వితీయమైన ప్రదర్శన కనబర్చిన తెలుగు యోధాస్ 55-43 తేడాతో ముంబై ఖిలాడీస్ను చిత్తు చేసింది. తెలుగు యోధాస్ కెప్టెన్ ప్రజ్వల్, రోహిన్ షింగారే అసాధారణ ప్రదర్శనతో విజయంలో కీలక పాత్ర పోషించారు.
ప్రజ్వల్ మూడు నిమిషాల ఒక సెకండ్ టైమ్ పాటు డిఫెండ్ చేసి తెలుగు యోధాస్ విజయానికి బాటలు వేసాడు. భార్గో 10 పాయింట్లతో ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చాడు. మూడు నిమిషాల 47 సెకన్ల పాటు ఔటవ్వకుండా డిఫెండ్ చేశాడు.
ఈ విజయంతో తెలుగు యోధాస్ పాయింట్స్ టేబుల్లో తమ టాప్ ప్లేస్ను మరింత పదిలం చేసుకుంది. 5 మ్యాచ్ల్లో 4 విజయాలతో 12 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక ముంబై ఖిలాడీస్ ఐదు మ్యాచ్ల్లో ఒకే విజయంతో 3 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది.

ముంబై ఖిలాడీస్ ఆటగాళ్లు కీలక సమయాల్లో పదే పదే ఫౌల్స్ చేసి మూల్యం చెల్లించుకున్నారు. తెలుగు యోధాస్ మాత్రం డ్రీమ్ రన్ పాయింట్స్తో ఆది నుంచి లీడ్లో కొనసాగారు. తెలుగు యోధాస్ ప్లేయర్ రోహిన్ షింగారే అటాకర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోగా.. బెస్ట్ డిఫెండర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ముంబై ఖిలాడీస్కు చెందిన దుర్వేష్ సాలుంకేకు దక్కింది.
చెన్నై క్విక్ గన్స్ హ్యాట్రిక్ విక్టరీ..
మరో మ్యాచ్లో చెన్నై క్విక్ గన్స్ గుజరాత్ జెయింట్స్ను రెండు పాయింట్లతో ఓడించి హ్యాట్రిక్ విజయాన్నందుకుంది. ఆసాంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో చెన్నై క్విక్ గన్స్ 53-51 తేడాతో గుజరాత్ జెయింట్స్పై థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. ఈ విజయంతో పాయింట్స్ టేబుల్లో నాలుగో స్థానంలో నిలిచింది. 20 పాయింట్లతో రామ్జీ కశ్యప్ సత్తా చాటి చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించాడు. మదన్ సైతం 11 పాయింట్లతో రాణించాడు. గుజరాత్ జెయింట్స్ తరఫున అనికేత్ 10 పాయింట్లతో పర్వాలేదనిపించాడు.
బుధవారం జరిగే మ్యాచ్ల్లో చెన్నై క్విక్ గన్స్.. ఒడిశా జాగర్నట్స్, ముంబై ఖిలాడీస్, రాజస్థాన్ వారియర్స్తో తలపడనున్నాయి.