
పుణే: అల్టిమేట్ ఖో ఖో లీగ్ ఆరంభ సీజన్ తుది దశకు చేరుకుంది. లీగ్లో ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్త్లు ఖారారు అయ్యాయి. దాంతో మంగళవారం జరిగిన నామమాత్రపు మ్యాచ్ల్లో ముంబై ఖిలాడీస్, రాజస్థాన్ వారియర్స్ ఓదార్పు విజయాలందుకున్నాయి. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఈ ఇరు జట్లు తప్పుకున్న విషయం తెలిసిందే. ఇక రాజస్థాన్ వారియర్స్ ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేసింది. వరుసగా 8 ఓటముల తర్వాత 9వ మ్యాచ్ను ఆ జట్టు గెలుపొందింది. అది కూడా 35 పాయింట్ల భారీ తేడాతో చెన్నై క్విక్ గన్స్పై విజయం సాధించింది.
మంగళవారం జరిగిన రెండో మ్యాచ్లో రాజస్థాన్ 66-31 తేడాతో చెన్నైకి షాకిచ్చింది. రాజస్థాన్ విజయంలో అటాకర్ హృషికేష్(14), డిఫెండర్ నిఖిల్ కీలక పాత్ర పోషించారు. హృషికేష్ 14 పాయింట్లతో సత్తా చాటగా నిఖిల్ 2.01 నిమిషాల పాటు తప్పించాడు. ప్లే ఆఫ్స్ చేరామనే ఆత్మవిశ్వాసంతో ఉన్న చెన్నై ప్రధాన ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చి బెంచ్ బలాన్ని పరీక్షించుకుంది.

అంతకు ముందు జరిగిన ముంబై ఖిలాడీస్ 79-31 తేడాతో ఒడిషా జాగర్నట్స్పై గెలుపొందింది. ముంబై విజయంలో అటాకర్ గజనాన్ షెనగల్, డిఫెండర్ అవిక్ సింఘా సత్తా చాటారు. గజనాన్ 17 పాయింట్లతో రాణించగా.. అవిక్ సింఘా 2.20 నిమిషాల పాటు తప్పించి జట్టుకు కీలక పాయింట్లు అందించాడు. దాంతో ముంబై ఖిలాడీస్ సునాయస విజయాన్నందుకుంది. టేబుల్ టాప్లో ఉన్న ఒడిషా సైతం ప్రధాన ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చి బెంచ్ బలాన్ని పరీక్షించుకుంది. ఒడిషా, గుజరాత్ టాప్-2లో ఉండగా.. తెలుగు యోధాస్, చెన్నై క్విక్ గన్స్ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
ఐపీఎల్ తరహాలోనే టాప్-2లో ఉన్న జట్లు క్వాలిఫయర్ మ్యాచ్ ఆడనుండగా.. మూడు, నాలుగు స్థానంలో ఉన్న టీమ్స్ ఎలిమినేటర్ ఆడనుంది. ఆ తర్వాత క్వాలిఫయర్2 ఆడి ఓ జట్టు ఫైనల్కు చేరనుంది.