
పుణే: అల్టిమేట్ ఖో ఖో లీగ్ ఆరంభ సీజన్ ఒడిశా జాగరనట్స్ అద్భుత విజయాన్నందుకుంది. చెన్నై క్విక్ గన్స్తో బుధవారం జరిగిన మ్యాచ్లో 10 పాయింట్ల తేడాతో గెలుపొందింది. లీగ్లో ఒడిశాకు ఇది వరుసగా మూడో విజయం కావడం విశేషం. టాస్ గెలిచి డిఫెన్స్ ఎంచుకున్న ఒడిశా 51-41 తేడాతో చెన్నైని ఓడించింది. డిఫెండింగ్లో మొత్తం 8 పాయింట్లతో సత్తా చాటిన ఒడిశా.. అటాకింగ్లో రాణించి అద్భుత విజయాన్నందుకుంది. ఈ విజయంతో పాయింట్స్ టేబుల్లో రెండో స్థానానికి దూసుకెళ్లింది. అంతేకాకుండా లీగ్లో చెన్నైని రెండోసారి ఓడించింది. తొలి మ్యాచ్లో ఒడిశా 8 పాయింట్లతో గెలిచింది.
ఇక ఒడిశా తరఫున నిలేశ్ జయదేవ్ 15 పాయింట్లతో సత్తా చాటాడు. ఐదు బ్రిలియంట్ డైవ్స్తో ఆకట్టుకున్నాడు. కెప్టెన్ మిలింద్ చవరేకర్(9), సురజ్ లాండే(8) పాయింట్లతో అతనికి సహకారం అందించారు. చెన్నై క్విక్ గన్స్ జట్టులో తెలుగు తేజం నర్సయ్య, మనోజ్ పాటిట్ 8 పాయింట్లతో రాణించినా ఫలితం లేకపోయింది. గౌతమ్, జగన్నాథ్ ముర్మూ 2.33 నిమిషాలు, 2.59 నిమిషాలతో డ్రీమ్ రన్స్ పాయింట్స్ అధించారు. ఆరంభం నుంచి ఒడిశా ఆధిపత్యం చెలాయించింది.

సెకండాఫ్లో చెన్నై పుంజుకొని సమం చేసినా.. ఒడిశా అవకాశం ఇవ్వలేదు. ముఖ్యంగా మూడో టర్న్లో ఒడిశా ఆల్రౌండర్ సుభాసిస్ సంట్రా 3.04 నిమిషాల పాటు తప్పించి బోనస్ పాయింట్ అందించాడు. చివరి టర్న్లో ఒడిశా 19 పాయింట్లు సాధించి విజయలాంఛనాన్ని పూర్తి చేసింది.