
పుణె: అల్టిమేట్ ఖోఖో లీగ్ ఆరంభ సీజన్లో ఎట్టకేలకు ముంబై ఖిలాడీస్ జట్టు బోణీ కొట్టింది. ఆదివారం గుజరాత్ జెయింట్స్ చేతిలో పరాజయంతో లీగ్ను మొదలెట్టిన ఆ జట్టు.. సోమవారం రాజస్థాన్ వారియర్స్పై విజయం సాధించింది. ముంబై 51-43 తేడాతో రాజస్థాన్ను ఓడించింది. మ్యాచ్లో గెలుపు కోసం రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. కానీ కీలక సమయాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన ముంబై జయభేరి మోగించింది. ముంబై ఆటగాడు గజానన్ షెన్గళ్ డైవ్లతో అదరగొట్టాడు.
మొత్తం 16 పాయింట్లు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. కెప్టెన్ విజయ్ హజారే, రోమన్ కొరె, అవిక్ సింఘా చకచకా పాయింట్లు సాధించడంతో తొలి అర్ధభాగంలోనే ముంబై 29-20 స్కోరుతో ఆధిక్యంలో నిలిచింది. అయితే రెండో అర్ధభాగంలో రాజస్తాన్ వరుసగా పాయింట్లు చేసి పోటీలో పడింది. ఆఖర్లో ముంబై ఆటగాళ్ల జోరు కొనసాగడంతో విజయం సాధించింది.
మరో మ్యాచ్లో ఒడిషా జగర్నట్స్ 51-43తో చెన్నై క్విక్ గన్స్పై గెలిచింది. ఒడిషా తరపున అటాకింగ్లో మహేష (6 పాయింట్లు), డిఫెన్స్లో దిలీప్ (ఒక్క నిమిషం ఒక్క సెకన్) రాణించారు. చెన్నైకి ఇది వరుసగా రెండో ఓటమి. నేడు జరిగే మ్యాచ్ల్లో రాజస్థాన్ వారియర్స్తో తెలుగు యోధాస్, గుజరాత్ జెయింట్స్తో ఒడిషా జగర్నట్స్ తలపడనున్నాయి.
తమ తొలి మ్యాచ్లో తెలుగు యోధాస్ దుమ్మురేపింది. 10 పాయింట్ల తేడాతో చెన్నై క్విక్ గన్స్ను ఓడించింది. తెలుగు టీమ్ 48 పాయింట్లు చేయగా.. చెన్నై 38 పాయింట్లకే పరిమితమైంది. డిఫెండర్ దీపక్ మాధవ్, అటాకర్ అరుణ్ గున్కీ రాణించి తెలుగు యోధాస్ గెలుపులో కీలకపాత్ర పోషించారు. తెలుగు యోధాస్ స్కోరు చేసిన మొత్తం పాయింట్లలో 24 టచ్ పాయింట్లు, 17 డైవ్ పాయింట్లు ఉండటం విశేషం.