పుణే: అల్టిమేట్ ఖో ఖో లీగ్ ఆరంభ సీజన్లో చెన్నై క్విక్ గన్స్ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖారారు చేసుకుంది. ముంబై ఖిలాడిస్ జట్టుతో సోమవారం జరిగిన కీలక మ్యాచ్లో చెన్నై క్విక్ గన్స్ 16 పాయింట్లతో గెలుపొందింది. చెన్నై అటాకర్, తెలుగు తేజం నర్సయ్యా అటాకింగ్లో దుమ్మురేపగా.. డిఫెండ్స్లో రామ్జీ అదరగొట్టాడు. దాంతో చెన్నై 58-42 తేడాతో ముంబై ఖిలాడిస్ను చిత్తు చేసింది. ఈ విజయంతో 15 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకున్న చెన్నై క్విక్ గన్స్ ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లింది.
అగ్రస్థానంలో ఉన్న ఒడిశా జగ్గర్నట్స్, రెండో స్థానంలో ఉన్న గుజరాత్ జెయింట్స్ ప్లే ఆఫ్స్ చేరుకున్నాయి. నాలుగో స్థానంలో ఉన్న తెలుగు యోధాస్ సైతం ప్లే ఆఫ్స్ చేరింది. ఇక ఆరు, ఏడు స్థానంలో నిలిచిన ముంబై ఖిలాడిస్, రాజస్థాన్ వారియర్స్ టైటిల్ రేసు నుంచి నిష్క్రమించాయి.
చెన్నైని ఓడిస్తే ముంబైకి అవకాశం దక్కేది. కానీ కీలక మ్యాచ్లో చెన్నై ఆటగాళ్లు అదరగొట్టారు. ఎలాంటి తప్పిదాలు చేయకుండా ఆరంభం నుంచి ఆధిపత్యం చెలాయించారు. పోల్ డైవ్స్, స్కై డైవ్స్తో అటాకింగ్లో రఫ్ఫాడించి.. డిఫెండింగ్లో డ్రీమ్ రన్ పాయింట్స్తో విజయాన్నందుకున్నారు. ముంబై ఖిలాడీస్ అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. పదే పదే ఫౌల్స్ చేస్తూ చెన్నై డిఫెండర్లకు అవకాశం ఇచ్చింది. చెన్నై డిఫెండర్ రామ్జీ కశ్యప్ 4 డ్రీమ్ రన్ పాయింట్స్తో విజయాన్ని ఖాయంచేశాడు.