గూండాలతో స్నేహం..
ఢిల్లీలోని మోడల్ హౌస్ ప్రాంతంలో కోట్లాది రూపాయల విలువైన ఒక ఫ్లాట్ ఈ హత్యకు దారి తీసినట్లు సమాచారం. తన భార్య పేరిట ఉన్న ఈ ఫ్లాట్ను సందీప్ అలియాస్ కాలా జఠేడి అనే వ్యక్తి భాగస్వామ్యంతో కలిసి సుశీల్ కొన్నాడు. సుశీల్ స్నేహం చేసిన ఈ కాలా జఠేడి న్యూఢిల్లీలో పెద్ద గ్యాంగ్స్టర్. అతనిపైన పెద్ద సంఖ్యలో పోలీసు కేసులు ఉన్నాయి.
ఢిల్లీ పరిసరాల్లో భూ కబ్జాల్లో అతని పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. చాలా మంది రెజ్లర్లతో పాటు క్రిమినల్స్ కూడా ఈ ఇంటికి వస్తూ పోతూ ఉండేవారు. ఇందులో కొన్నాళ్లుగా జఠేడి మేనల్లుడి వరుస, అత్యంత ఆత్మీయుడైన రెజ్లర్ సోనూ మహల్, మరో రెజ్లర్ సాగర్ రాణా ఉంటున్నారు. రెజ్లర్ సోనూపై కూడా పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. సమభాగస్వామ్యం ఉన్న ఈ ఫ్లాట్ను జఠేడి అమ్మాలని భావించగా, అందుకు సుశీల్ అంగీకరించలేదు. దానిని అమ్మి తన డబ్బులు ఇవ్వాలంటూ సుశీల్పై జఠేడి ఒత్తిడి పెంచగా... ఫ్లాట్లో ఉంటున్న సోనూ, సాగర్ ఖాళీ చేయాలంటూ సుశీల్ మరోవైపు చెబుతూ వచ్చాడు.
తానేంటో చూపించాలని..
సుశీల్ గత కొంత కాలంగా జఠేడి ప్రత్యర్థి అయిన మరో గ్యాంగ్స్టర్ నీరజ్ బవానా, నవీన్ బాలిలతో స్నేహం పెంచుకోవడం కూడా జఠేడి ఆగ్రహానికి కారణమైంది. ఫ్లాట్ ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున్న సుశీల్పై సోనూ తదితరులు బహిరంగంగా దుర్భాషలాడటం మొదలు పెట్టారు. దాంతో వారికి గుణపాఠం చెప్పాలని సుశీల్ నిర్ణయించుకున్నాడు.
ఈ క్రమంలో మే 4న స్టేడియం ముందు వీరంతా ఎదురెదురుగా తలపడ్డారు. అప్పటికే నీరజ్కు సంబంధించిన గూండాలను సుశీల్ తన కోసం పిలిపించుకున్నాడు. జఠేడి భయంతో సుశీల్ తనను ఏమీ చేయడని సోనూ భావించినా... నీరజ్ గూండాలు వారిని చితకబాదారు. ఆవేశపరుడైన సుశీల్ కూడా తాను ఓ చేయి వేశాడు. పైగా తనేంటో అందరికీ తెలియాలని, వారిలో భయం ఉండాలంటూ ఈ ఘటనను వీడియో షూట్ చేయమని తనవారికి సూచించాడు. తీవ్రంగా గాయపడిన సాగర్ తర్వాతి రోజు ఆసుపత్రిలో మరణించడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది.
కొంపముంచిన వీడియో..
అయితే సాగర్ రాణా హత్య కేసులో సుశీల్ పీకల్లోతు ఇరుక్కుపోవడానికి ఈ వీడియోనే కారణమైంది. నిందితుల్లో ఒకడైన ప్రిన్స్ దాడి ఘటనను వీడియో తీయగా.. సాగర్ చనిపోయిన రెండు రోజుల తర్వాత అతణ్ని అదుపులోకి తీసుకున్నపుడు తన మొబైల్ పరిశీలించగా అది బయటపడింది. అందులో సుశీల్ సైతం సాగర్పై దాడి చేస్తున్నట్లు కనిపించడంతో ఈ కేసులో అతడికి వ్యతిరేకంగా పోలీసులకు బలమైన సాక్ష్యం దొరికినట్లయింది.
మరోవైపు హత్య కేసు విచారణ జరుగుతున్నందున సుశీల్ విషయంలో తాము చేసేదేమీ లేదని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) సహాయ కార్యదర్శి వినోద్ తోమర్ అన్నాడు. సుశీల్ పట్ల తమకు సానుభూతి ఉందని, కానీ అతడి లాంటి దిగ్గజ రెజ్లర్ మీద ఇలాంటి అభియోగాలు రావడం వల్ల దేశంలో రెజ్లింగ్ ప్రతిష్ట దెబ్బ తింటుందన్నది మాత్రం వాస్తవమని అతను చెప్పాడు.
కంటతడి పెట్టిన సుశీల్..
ఇక చేసిన తప్పిదం పట్ల సుశీల్ కుమార్ పశ్చాత్తప పడుతున్నాడని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. లాకప్లో సుశీల్ కంట తడి పెట్టాడని, రాత్రంతా మేల్కొనే ఉన్నారని చెప్పారు. అంతేకాకుండా భోజనం చేయడానికి నిరాకరించాడని, రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాడని తెలిపారు. సుశీల్ను అన్ని కోణాల్లో విచారిస్తున్నామని, పరారీలో అతనికి సహకరించివారి గురించి కూడా ఆరా తీస్తున్నామని పోలీసులు స్పష్టం చేశారు. త్వరలోనే ఘటనా స్థలానికి తీసుకెళ్లి సీన్ రీక్రేయేట్ చేస్తామన్నాడు. పోలీసుల రిమాండులో ఉన్న దిగ్గజ రెజ్లర్ సుశీల్ కుమార్పై ఉత్తర రైల్వే వేటు వేయబోతోంది. ఆ సంస్థలో సుశీల్ చాలా ఏళ్ల నుంచి ఉద్యోగిగా ఉన్నాడు.