హైదరాబాద్: అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జెస్వాల్ ఫేస్బుక్ను గుర్తుతెలియని దుండగులు హ్యాక్ చేశారు. ఆ అకౌంట్ నుంచి అసభ్య పోస్ట్లు, వీడియోలు పోస్ట్ చేస్తుండటంతో ఈ విషయాన్ని గుర్తించిన నైనా.. మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీకి ఫిర్యాదు చేసింది. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నగరంలోని కాచిగూడలో నివసించే నైనా జైస్వాల్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో టేబుల్ టెన్నిస్ ఆడి అనేక టైటిల్స్ కైవసం చేసుకుంది. 2011లోనే ఐటీటీఎఫ్ వరల్డ్ హోప్స్ టీమ్లోకి ఎంపికై చరిత్ర సృష్టించింది. ఈ ఘనత సాధించిన తొలి భారత బాలికగా నిలిచింది. జాతీయ స్థాయిలో తిరుగులేని ఆటతీరుతో సింగిల్స్, డబుల్స్ కేటగిరీల్లో ఎన్నోసార్లు చాంపియన్గా నిలిచింది. గతంలో ఆమె అండర్-15 కేటగిరీలో భారత నం.1గా సత్తాచాటింది. ఇక అంతర్జాతీయంగా ఐటీటీఎఫ్ టైటిళ్లను తన ఖాతాలో వేసుకుంది.
— Naina Jaiswal (@Nainajaiswal14) February 26, 2020
దీంతో పాటు ఎనిమిదో ఏటనే టెన్త్, పదో ఏట ఇంటర్మీడియట్, 13వ ఏట డిగ్రీ, 15 ఏట పీజీ పూర్తి చేసిన ఆమె 17వ ఏట నుంచే పీహెచ్డీ చేయడం ప్రారంభించారు. తన రెండు చేతులతోనూ ఏకధాటిగా రాయగలగడంతో పాటు మోటివేషనల్ స్పీకర్గానూ పేరున్న నైనా జైస్వాల్ ఫేస్బుక్కు దాదాపు 2 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. దీన్ని హ్యాక్ చేసిన గుర్తుతెలియని వ్యక్తి పాస్వర్డ్ మార్చేశాడు. దీంతో నైనా సైతం తన ఖాతాను యాక్సస్ చేయలేకపోతున్నారు. ఈ ఖాతాలోకి సదరు దుండగుడు కొన్ని వీడియోలను అప్లోడ్ చేశాడు. దీంతో ఈ వీడియోలను పట్టించుకోవద్దని, తన ఖాతా హ్యాక్కు గురైందని తెలియజేస్తూ ఆమె ట్వీట్ చేసింది.