
టోక్యో: ప్రతిష్టాత్మక పారాలింపిక్స్ ప్రారంభానికి ముందే భారత అథ్లెట్ల బృందానికి గట్టి షాక్ తగిలింది. మరికొద్ది సేపట్లో ప్రారంభమయ్యే ఈ విశ్వక్రీడల ఆరంభ వేడుకల్లో భారత్ జెండాను చేతపట్టుకోని కవాతు చేస్తాడని భావించిన హైజంపర్, రియో పారాలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ మరియప్పన్ తంగవేలుకు కరోనా సెగ తగిలింది. భారత్ నుంచి టోక్యోకు వచ్చిన ఓ వ్యక్తికి కరోనా సోకగా.. అతడితో తంగవేలు సన్నిహితంగా ఉన్నాడు. దాంతో నిర్వాహకులు అతన్ని క్వారంటైన్కు తరలించారు. దాంతో మరియప్పన్ స్థానంలో జావెలిన్ త్రోవర్ టెక్ చంద్ భారత ఫ్లాగ్ బేరర్గా వ్యవహరించనున్నాడు.
తాజా పరిణామాల నేపథ్యంలో ఆరంభ వేడుకల్లో పాల్గొనే మన అథ్లెట్ సంఖ్య నాలుగుకు చేరింది. ఈ నలుగురు అథ్లెట్లతో పాటు ఆరుగురు అధికారులతో మొత్తం 10 మందితో కూడిన భారత జట్టు మార్చ్పాస్ట్లో పాల్గొననుంది.ఇరాన్ తర్వాత 17వ దేశంగా భారత్ స్టేడియంలోకి అడుగుపెట్టనుంది. పారాలింపిక్స్ మార్చ్పాస్ట్లో అథ్లెట్లకు పరిమితులేమీ లేవు. అయితే టోక్యోకు భారత్ నుంచి ఇప్పటివరకు కేవలం ఏడుగురు అథ్లెట్లు మాత్రమే వచ్చారు. ఇందులో ఇద్దరు టేబుల్ టెన్నిస్ ప్లేయర్లు సోనల్ పటేల్, భవిన పటేల్లకు మరుసటి రోజు (బుధవారం) పోటీలున్నాయి.
దీంతో వారిని మినహాయించి ఐదుగురు అథ్లెట్లకు జతగా ఆరుగురు అధికారులు మార్చ్పాస్ట్ చేస్తారని భారత పారాలిం పిక్ కమిటీ కార్యదర్శి, చెఫ్ డి మిషన్ గుర్శరణ్ చెప్పా రు. మువ్వన్నెల పతాకధారి మరియప్పన్ తంగవేలుతో పాటు వినోద్ కుమార్ (డిస్కస్ త్రో), టెక్ చంద్ (జావెలిన్ త్రో), జైదీప్, సకీనా ఖాతూన్ (పవర్ లిఫ్టర్లు)లు ప్రారంభోత్సవంలో కవాతు చేయనున్నారని తెలిపారు. కానీ కరోనా కారణంగా మరియప్పన్ తంగవేలు తప్పుకోవడంతో కవాతు చేసే ఆటగాళ్ల సంఖ్య నాలగుకు పడిపోయింది.
2016 రియో పారాలింపిక్స్ హైజంప్ క్రీడలో స్వర్ణం సాధించిన మరియప్పన్ తంగవేలుకు.. 2017లో పద్మశ్రీ, అర్జున పురస్కారాలతో కేంద్రప్రభుత్వం సత్కరించింది. గతేడాది మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న అవార్డునూ అందుకున్నాడు. టోక్యో పారాలింపిక్స్లో ఈ సారి భారతదేశం తరఫున అత్యధికంగా 54 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 5 వరకు 13 రోజుల పాటు జరిగే పారా విశ్వక్రీడల్లో 163 దేశాలకు చెందిన సుమారు 4500 మంది అథ్లెట్లు పాల్గొననున్నారు. 22 క్రీడలకు సంబంధించి 540 ఈవెంట్లలో పోటీలు జరగనున్నాయి.
1972 నుంచి పారాలింపిక్స్లో బరిలోకి దిగుతున్న ఇండియా ఇప్పటివరకు 12 పతకాలు సాధించింది. ఇందులో 2016 రియో గేమ్స్లో రెండు గోల్డ్, ఒక సిల్వర్, ఒక బ్రాంజ్తో 43వ ప్లేస్లో నిలిచింది. అయితే ఈసారి ఆ సంఖ్యను మార్చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 5 గోల్డ్ మెడల్స్తో కలిపి 15 పతకాలు గెలవాలని ప్లాన్స్ చేస్తోంది. ఇందుకోసం 54 మంది బరిలోకి దిగుతుండగా, 9 క్రీడాంశాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కరోనా నేపథ్యంలో ఈసారి చాలా దేశాలు గేమ్స్ నుంచి వైదొలిగాయి. దీంతో ఈసారి ఇండియా టాప్-25లో ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.