ఇంఫాల్: టోక్యో ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్తో సత్తా చాటిన భారత వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానుకు మణిపూర్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. అసాధారణ ప్రతిభతో విశ్వవేదికపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన చానుకు కోటీ రూపాయల నజరానాతో పాటు ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇస్తామని ఆ రాష్ట్ర సీఎం ఎన్ బీరెన్ సింగ్ శనివారం ప్రకటించారు. ఆమె సాధించిన విజయానికి అభినందనలు తెలుపుతు చానుతో వీడియో కాల్లో మాట్లాడారు. ఈ సందర్భంగా మీరాబాయి చాను తన విజయానందాన్ని సీఎంతో పంచుకుంది. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించేందుకు ఇదో ఆరంభమని, రాబోయే రోజుల్లో బంగారు పతకాలు సాధిస్తాని చెప్పింది.
అనంతరం సీఎం బీరెన్ సింగ్ మాట్లాడుతూ.. ''ఈ రోజు షిల్లాంగ్లో ఈశాన్య రాష్ట్రాల సీఎంల సమావేశంలో నీ గెలుపు గురించి అందరికీ వెల్లడించాను. అక్కడే ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఎంతో ఆనందించారు. దేశం గర్వించదగిన విషయమని ప్రశంసించారు. అమిత్ షాతో పాటు అంతా నిలబడి చప్పట్లతో అభినందనలు తెలిపారు'' అని వివరించారు. ప్రస్తుతం రైల్వే టీసీగా పనిచేస్తున్న మీరాబాయి చానుకు ఆ ఉద్యోగానికి బదులుగా మరో కొత్త ఉద్యోగాన్ని రిజర్వు చేసి ఉంచుతున్నట్టు చెప్పారు. ఈ సాయంత్రం అమిత్ షాతో సమావేశమవుతానని, నీకో సర్ప్రైజ్ ఇస్తాం'' అంటూ ఆయన తెలిపారు.
So good to speak to our Champion @mirabai_chanu today.@narendramodi @AmitShah @ianuragthakur @JPNadda @blsanthosh pic.twitter.com/1phL16ibh3
— N.Biren Singh (@NBirenSingh) July 24, 2021
టోక్యో ఒలింపిక్స్ రెండో రోజు మహిళల వెయిట్లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను సిల్వర్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. చైనాకు చెందిన హౌ జిహోయ్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్న మీరాబాయి స్నాచ్లో 87 కిలోలు, క్లీన్ అండ్ జర్క్లో 115 కిలోలు.. మొత్తంగా 202 కిలోలు ఎత్తి రెండో స్థానంలో నిలిచింది. స్నాచ్లో మొదటి అవకాశంలో 84 కిలోలు ఎత్తిన ఆమె.. రెండోసారి 87 కిలోలు ఎత్తింది. అంతకన్నా ఎక్కువ ఎత్తాలన్న ఉద్దేశంతో మూడోసారి 89 కిలోలు ప్రయత్నించి విఫలమైంది.
ఇక క్లీన్ అండ్ జర్క్లో అద్భుతమే చేసింది. మొదట 110 కిలోలను అలవోకగా ఎత్తింది. అయితే కాంస్యం గెలిచిన విండీ కాంటిక క్లీన్ అండ్ జర్క్లో ఎత్తిన అత్యధిక బరువు 110 మాత్రమే. దాంతో మీరాకు పతకం ఖాయమని అర్థమైపోయింది. రెండో అవకాశంలో 115 కిలోలు ఎత్తి రజతం ఖాయం చేసుకుంది. స్వర్ణం రాదని తెలిసినా.. మెరుగైన రికార్డు కోసం 117 కిలోలు ప్రయత్నించి విఫలమైంది. మీరాబాయి విజయం పట్ల యావత్ దేశం గర్విస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ నుంచి సాధారణ జనం వరకు అంతా ఆమె విజయాన్ని అభినందిస్తున్నారు.