
టోక్యో: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్లో భారత మహిళల హాకీ జట్టు శుభారంభాన్ని అందుకోలేకపోయింది. వరల్డ్ నెంబర్ వన్ నెదర్లాండ్స్తో శనివారం జరిగిన మ్యాచ్లో 5-1తో రాణీరాంపాల్ నేతృత్వంలో భారత జట్టు చిత్తుగా ఓడింది. నెదర్లాండ్స్ ప్లేయర్ ఫెలిస్ అల్బెర్స్(6వ నిమిషం, 43వ నిమిషం) రెండు గోల్స్తో భారత పతనాన్ని శాసించింది. ఆ జట్టు మిడ్ ఫీల్డర్ ఫ్రెడిక్ మాట్లా(45వ నిమిషం), కైవాన్ మసాక్కర్ (52వ నిమిషం) చెరొక గోల్స్ అందించగా.. పెనాల్టీ కార్నర్ను మార్గోట్ గోల్గా మలిచింది. ఇక భారత్ తరఫున కెప్టెన్ రాణీ రాంపాల్(10వ నిమిషం) మాత్రమే గోల్ సాధించింది.
ఆట ప్రారంభమైన 6 వ నిమిషంలోనే అల్బెర్స్ నెదర్లాండ్కు గోల్ అందించి ఆధిక్యంలో నిలపగా.. మరో నాలుగు నిమిషా వ్యవధిలో భారత కెప్టెన్ రాణీ రాంపాల్ గోల్ కొట్టి స్కోర్లు సమం చేసింది. ఆ తర్వాత ఇరు జట్లు హోరాహోరీగా తలపడటంతో మరో గోల్ నమోదు కాలేదు. దాంతో ఫస్టాఫ్ 1-1తో ముగిసింది. ఇక సెకండాఫ్లో దుమ్మురేపిన వరల్డ్ నెంబర్ వన్ నెదర్లాండ్స్.. భారత్పై ఆధిపత్యం చెలాయించింది. బంతిని మొత్తం తమ ఆధీనంలోనే ఉంచుకుంటూ భారత మహిళలను ఒత్తిడిలోనికి నెట్టింది.
ఈ క్రమంలో లభించిన పెనాల్టీ కార్నర్ను మార్గోట్ గోల్గా మలచి 2-1తో లీడ్ అందించింది. ఆ తర్వాత మరింత జోరు పెంచిన డచ్ మహిళలు భారత డిఫెన్స్ను చేదిస్తూ పదేపదే గోల్ పోస్ట్లోకి దూసుకొచ్చారు. భారత ప్లేయర్లు ప్రతిఘటించినా అవకాశం ఇవ్వలేదు. దాంతో రెండు నిమిషాల వ్యవధిలోనే వరుసగా రెండు గోల్స్ కొట్టిన డచ్ మహిళలు తమ ఆధిక్యాన్ని మూడింతలు చేసుకున్నారు. ఇక ఆట చివరి భాగంలో కూడా పట్టువదలని నెదర్లాండ్స్.. మరో పెనాల్టీ కార్నర్ ను సద్వినియోగం చేసుకొని గోల్గా మలిచింది. దాంతో భారత్ ఓటమి ఖాయమైంది. ఇక పూల్-ఏలో ఉన్న భారత్ సోమవారం తమ తదుపరి మ్యాచ్ జర్మనీతో ఆడనుంది. జూలై 28న గ్రేట్ బ్రిటన్, జూలై 30న ఐర్లాండ్, జూలై 31న సౌతాఫ్రికాతో తలపడనుంది.