
టోక్యో: ఏడాది ఆలస్యమైనా.. అనుకోని సవాళ్లు ఎదురైనా.. మొక్కవోనీ ధైర్యంతో.. నిండైన ఆత్మవిశ్వాసంతో మొదలైన టోక్యో ఒలింపిక్స్ 2020.. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను పక్కనబెడుతూ.. దిగ్విజయంగా ముగిసాయి. కరోనాతో ముగింపు వేడుకల్లో అబ్బురపరిచే విన్యాసాలు లేకపోయినా.. భారీతనం ఉట్టిపడే కళాకృతులు కనిపించకపోయినా.. ప్రపంచ ప్రఖ్యాత కళాకారుల నృత్య ప్రదర్శనలు లేకపోయినా.. విశ్వక్రీడలకు ఉండే ప్రత్యేకతకు ఏ మాత్రం లోటు లేకుండా వేడుకలు జరగాయి. కళ్లు మిరుమిట్లు గొలిపే బాణసంచా వెలుగులు..చెవులకు వినసొంపైన వెస్ట్రన్ మ్యూజిక్.. జపాన్ సంస్కృతి, వారసత్వం ప్రతిబింబించేలా పరిమిత సంఖ్యలో అలరించిన నృత్యాలతో జపాన్ నేషనల్ స్టేడియం హోరెత్తింది. గతానికి ఏ మాత్రం తీసిపోకుండా.. సాధారణానికి కొత్తదనాన్ని జోడిస్తూ.. ఒలింపిక్స్ పెద్దల కరతాల ధ్వనుల మధ్య సాగిన అథ్లెట్ల ముగింపు పరేడ్ చూపరులను కట్టిపడేసింది.
జపాన్ జాతీయ జెండా ఆవిష్కరణతో ఈ వేడుకలు మొదలయ్యాయి. పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించిన రెజ్లర్ బజరంగ్ పునియా భారత బృందానికి ఫ్లాగ్ బేరర్గా వ్యవహరించాడు. పరేడ్ సందర్భంగా భారత అథ్లెట్ల ముఖాల్లో చిరునవ్వులు కనిపించాయి. ఈ వేడుకల్లో ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్తో పాటు మరికొంత మంది ప్రముఖులు పాల్గొన్నారు. ప్యారిస్ వేదికగా జరగబోయే తదుపరి(2024) ఒలింపిక్స్ గురించి పది నిమిషాల వీడియోను ఈ వేదికల్లో ప్రదర్శించారు. చివర్లో ఒలింపిక్స్ టార్చ్ను, జెండాను పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులకు అందించడంతో ఈ ముగింపు వేడుకలు ముగిసాయి.
ఈ ఒలింపిక్స్లో భారత్ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చింది. స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలతో మొత్తంగా ఏడు పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది. 2012 లండన్ ఒలింపిక్స్లో 6 పతకాల తర్వాత భారత అత్యుత్తమ ప్రదర్శన ఇదే. మీరాబాయి చాను రజతంతో మొదలైన భారత ప్రయాణం నీరజ్ చోప్రా స్వర్ణంతో ముగిసింది.
ఈ టోక్యో ఒలింపిక్స్ భారత్కు మరుపురాని విశ్వక్రీడలుగా నిలిచిపోయాయి. ఇక ఈ ఒలింపిక్స్లో మొత్తం 85 దేశాలు మెడల్స్ ఖాతా తెరవగా.. భారత్ ఏడు పతకాలతో మెడల్స్ టేబుల్లో 47వ స్థానంలో నిలిచింది. ఈ సారి కూడా పతకాల వేటలో అమెరికా, చైనా, జపాన్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. 39 స్వర్ణాలతో అమెరికా అగ్రస్థానంలో నిలవగా.. 38 స్వర్ణాలతో చైనా రెండో స్థానంలో, 27 స్వర్ణాలతో ఆతిథ్య జపాన్ మూడో స్థానంలో నిలిచింది. ఓవరాల్గా పతకాల వారిగా చూసుకుంటే అమెరికా 113 పతకాలు(39 స్వర్ణం, 41 రజతం, 33 కాంస్యం), చైనా 88 పతకాలు( 38 స్వర్ణం, 32 రజతం, 18 కాంస్యం), జపాన్ 58 పతకాలు (27 స్వర్ణం, 14 రజతం, 17 కాంస్యం) సాధించాయి.