టోక్యో: మరో ఐదు రోజుల్లో ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న వేళ.. కరోనా వైరస్ కలకలం రేపింది. ఒలింపిక్స్ క్రీడా గ్రామంలో శనివారం తొలి కరోనా కేసు నమోదవ్వగా.. ఆదివారం మరో రెండు కొవిడ్ కేసులు నిర్దారణ అయ్యాయి. అథ్లెట్లకు నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్షల్లో ఇద్దరికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. వెంటనే వారిని ఐసోలేషన్కు తరలించినట్లు పేర్కొన్నాడు.
కరోనా మహమ్మారి కారణంగా ఏడాది పాటు వాయిదా పడిన ఒలింపిక్స్ ఈ నెల 23 నుంచి టోక్యోలో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 13న టోక్యో వేదికగా ఈ క్రీడా గ్రామాన్ని తెరిచారు. ఇప్పటికే వేలాది మంది అథ్లెట్లు, అధికారులు ఈ గ్రామానికి చేరుకున్నారు. కరోనా దృష్ట్యా కఠిన నిబంధనల నడుమ ఒలింపిక్స్ను నిర్వహించనున్నారు. ఈ విశ్వక్రీడలకు దాదాపుగా 11వేల మంది, పారాలింపిక్స్కు 4,400 మంది క్రీడాకారులు రానున్నారు. పారాలింపిక్స్ ఆగస్టు 24 నుంచి మొదలవుతాయి. క్రీడాగ్రామంలోకి వస్తున్న అథ్లెట్లలో 80 శాతం మందికి వ్యాక్సినేషన్ జరిగిందని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తెలిపింది.
ఒలింపిక్స్ కోసం భారత అథ్లెట్ల ఫస్ట్ బ్యాచ్ శనివారం ఢిల్లీ నుంచి టోక్యోకు బయలుదేరింది. ఎనిమిది క్రీడలు.. ఆర్చరీ, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, హాకీ, జూడో, జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్, వెయిట్లిఫ్టింగ్కు చెందిన 88 సభ్యుల బృందంలో 54 మంది అథ్లెట్లతో పాటు సహాయ సిబ్బంది, ఐఓఏ ప్రతినిధి ఉన్నారు. తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు పీవీ సింధు, సాయి ప్రణీత్, సాత్విక్ సాయిరాజ్ శనివారం బయల్దేరి వెళ్లిన బృందంలో ఉన్నారు.
ఈ ఒలింపిక్స్కు భారత్ మొత్తం 228 బృందం వెళ్తోంది. ఇందులో 119 మంది క్రీడాకారులు ఉన్నారు. భారత రోయింగ్, షూటింగ్ జట్లు ఇప్పటికే టోక్యో చేరుకున్నాయి. ఇటలీ నుంచి బయల్దేరిన బాక్సింగ్ బృందం ఆదివారం చేరుకుంటుంది. భారత్ నుంచి నలుగురు సెయిలర్లతో కూడిన బృందం తొలుత టోక్యోలో అడుగుపెట్టింది. గురువారమే సెయిలర్లు అక్కడికి చేరుకున్నారు. సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ ఐవోఏ ప్రెసిడెంట్ నరీందర్ బాత్రా, సెక్రటరీ రాజీవ్ మోహతా, సాయ్ డైరెక్టర్ సందీప్ ప్రధాన్.. ప్లేయర్లకు సెండాఫ్ ఇచ్చారు.