Runner Revathi: బూట్లు లేకుండా పరుగెత్తిన పరుగుల చిరుత.. పట్టుదలతో టోక్యో ఒలింపిక్స్కు..!

న్యూఢిల్లీ: ఐదేళ్ల వయస్సులో తల్లిదండ్రుల మరణం.. దాంతో చెల్లితో కలిసి రోజు కూలీ చేసుకునే అమ్మమ్మ ఇంటికి చేరింది ఆ చిన్నారి.! తినడానికి సరైన తిండికూడా లేని దుర్భరస్థితిలో తారా జువ్వలా దూసుకొచ్చింది ఆ చిన్నారి. కష్టాలతో సావాసం చేసి స్టార్ అథ్లెట్గా ఎదిగింది. ఏకంగా టో ఒలింపిక్స్లో భారత్కు ప్రాతినిథ్యం వహించే అవకాశాన్నే అందుకుంది. ఆమే తమిళనాడుకు చెందిన 23 ఏళ్ల రన్నర్ రేవతి. ప్రపంచ దృష్టిని ఆకర్షించే ఈ మెగా ఈవెంట్లో పాల్గొనాలనేది ప్రతి అథ్లెట్ జీవితకాల స్వప్నం. విశ్వవేదికపై అత్యుత్తమ ప్రదర్శనతో పతకాలు నెగ్గాలనే లక్ష్యంతో.. ఏళ్ల తరబడి శ్రమిస్తుంటారు. ఇప్పుడు ఆ అవకాశాన్ని రేవతి లక్కీగా అందుకుంది. దేశ జెండాను రెపరెపలాడించేందుకు సిద్దమవుతోంది.

బూట్లు లేకుండానే..
రేవతి తల్లిదండ్రులు ఆమె చిన్నతనంలోనే అనారోగ్యంతో కొద్ది నెలల వ్యవధిలో చనిపోయారు. దాంతో మధురై జిల్లాలోని సాకి మంగళం గ్రామంలో నివసించే 76 ఏళ్ల అమ్మమ్మ అరమ్మాళ్ వద్దకు అక్కాచెల్లెళ్లు చేరారు. స్కూల్లో ఉన్న సమయంలో పరుగులో రేవతి ప్రతిభను గమనించిన తమిళనాడు స్పోర్ట్స్ డెవల్పమెంట్ అథారిటీ కోచ్ కన్నన్ ఆమె నైపుణ్యాలకు మెరుగులు దిద్దాడు. అంతేకాదు మధురైలోని లేడీ డోక్ కాలేజీలో ఆమెకు సీటుతోపాటు, హాస్టల్ వసతి లభించేలా సాయం చేశాడు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో బూట్లు లేకుండానే ప్రాక్టీస్ చేసిన రేవతి అనేక కాలేజీ మీట్లతోపాటు 2016 జూనియర్ నేషనల్స్లో ఉత్తి కాళ్లతోనే పరుగెత్తి విజయాలు సాధించింది.

ఎన్ఐఎస్లో చేరికతో..
2019 వరకు కన్నన్ వద్ద శిక్షణ పొందిన రేవతి అనంతరం పటియాలలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్ఐఎస్)లో జాతీయ శిబిరానికి ఎంపికైంది. అప్పటివరకు 100, 200 మీ.లలో పరిగెత్తిన రేవతి.. ఎన్ఐఎస్ కోచ్ గలినా బుఖారియా సలహాతో 400మీ.కు మారింది. 2019 ఫెడరేషన్ కప్లో 200 మీటర్ల విభాగంలో సిల్వర్ మెడల్ నెగ్గిన రేవతి.. ఇండియన్ గ్రాండ్ ప్రీ 5,6లో 400 మీ.లో స్వర్ణ పతకాలు గెలిచింది. గాయంతో 2021లో పోటీలకు దూరమైంది. గాయంనుంచి కోలుకొని గ్రాండ్ప్రీ -4లో 400 మీ. విజేతగా నిలిచింది. ఇంటర్ స్టేట్ చాంపియన్షిప్లో 53.71 సె.తో ప్రియా మోహన్, పూవమ్మ తర్వాత మూడో స్థానంలో సాధించింది.

లక్కీగా ఒలింపిక్స్ బెర్త్..
ఒలింపిక్స్ శిక్షణ శిబిరంలో ప్రియా మోహన్ లేకపోవడం, పూవమ్మకు గాయం కావడం, వీకే విస్మయ, జిస్నా మాథ్యూ ఫామ్లో లేకపోవడంతో 400 మీటర్ల మిక్స్డ్ రిలే జట్టులో ముగ్గురు మహిళా రన్నర్లకోసం అథ్లెటిక్స్ సమాఖ్య సెలెక్షన్ ట్రయల్స్ నిర్వహించింది. ఇందులో 53.55 సెకన్ల వ్యక్తిగత అత్యుత్తమ సమయంలో రేవతి అగ్రస్థానం సంపాదించి ఒలింపిక్స్ రిలే జట్టులో స్థానం దక్కించుకుంది. ఒలింపిక్స్లో పాల్గొనాలన్న తన కల నిజమైందని, అయితే అది ఇంత త్వరగా నెరవేరుతుందని అనుకోలేదని రేవతి చెప్పుకొచ్చింది. విశ్వక్రీడల్లో బాగా రాణిస్తాననే నమ్మకం ఉందని తెలిపింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications