
టోక్యో: కరోనా మహమ్మారి ముప్పు నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్కు ప్రేక్షకుల అనుమతిపై నిషేధం విధించాలని జపాన్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరో 16 రోజుల్లో ఈ మెగా ఈవెంట్కు తెరలేవనున్న క్రమంలో అక్కడ కరోనా ఉదృతి ఎక్కువవ్వడం దీనికి కారణమని రాయిటర్స్ పేర్కొంది. జపాన్ వైద్య నిపుణులు సైతం ప్రేక్షకులను అనుమతించకుండే నిషేధం విధిస్తే కరోనా వైరస్ వ్యాప్తి కొంత వరకు అడ్డుకోవచ్చని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. దాంతో ప్రేక్షకుల అనుమతిపై నిషేధం విధించి టోక్యోలో అత్యయిక స్థితి విధించాలని జపాన్ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే ఇతర దేశాల నుంచి వచ్చే ప్రేక్షకులపై నిర్వాహకులు నిషేధం విధించారు. స్టేడియం సామర్థ్యంలో 50 శాతం వరకు సుమారు 10వేల మంది ప్రేక్షకులను అనుమతిస్తామని కొన్ని వారాల కింద ప్రకటించారు. కానీ జపాన్లో కొవిడ్ కేసులు వరుసగా పెరుగుతుండడంతో నిర్వాహకులు పునరాలోచనలో పడ్డారు. ఇక కరోనా వైరస్ నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్ను అక్కడి మెజార్టీ ప్రజలను వ్యతిరేకిస్తున్నారు.
ప్రజలకు సమాధానం చెప్పలేక అక్కడి అధికారులు తెగ ఇబ్బంది పడుతున్నారు. ఇక ఆదివారం జరిగిన టోక్యో అసెంబ్లీ ఎన్నీకల్లో అధికార పార్టీకీ గట్టి ఎదురుదెబ్బతగిలినట్లు తెలుస్తోంది. టోక్యో ఒలింపిక్స్ విషయంలో మొండిగా వ్యవహరిస్తున్న ప్రధాని యోషిదే సుగా ప్రభుత్వానికి ప్రజలు గట్టిగా బుద్ది చెప్పారని సమాచారం.
ఈ క్రమంలోనే ప్రేక్షకుల అనుమతిపై నిషేధం విధించాలనే నిర్ణయానికి జపాన్ ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు నిర్వాహకులు సైతం ప్రేక్షకుల అనుమతి విషయంపై వెనక్కి తగ్గారని జపాన్కు చెందని ఓ పత్రిక పేర్కొంది. ప్రేక్షకులను అనుమతించకుండా ఒలింపిక్స్ను కేవలం టీవీలకు పరిమితం చేసినా.. ఐఓసీకి 3 నుంచి 4 బిలియన్ డాలర్ల ఆదాయం రానుంది. దాంతో ఈ సమ్మర్ గేమ్స్ను టీవీలకే పరిమితం చేయాలనుకుంటున్నట్లు సమాచారాం.