
టోక్యో: ఒలింపిక్స్ సమీపిస్తుండగా ఆతిథ్య నగరం టోక్యోపై కరోనా వైరస్ ప్రభావం పెరుగుతుండటం ఈ మెగా ఈవెంట్ నిర్వాహకుల్లో గుబులు రేపుతోంది. ఈ నెల 21న టోక్యోలో అత్యవసర స్థితిని ఎత్తివేయగా.. అప్పట్నుంచి అక్కడ రోజువారీ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. బుధవారం ఒక్కరోజే 714 కొత్త కేసులు నమోదయ్యాయి. కొన్ని నెలల్లో టోక్యోలో నమోదైన అత్యధిక కేసులివే కావడం గమనార్హం. మంగళవారంతో పోలిస్తే కేసుల సంఖ్య 238 పెరిగింది.
గత వారం రోజుల్లో సగటు రోజు వారీ కేసులు 500కు పైగానే ఉన్నాయి. మొత్తంగా జపాన్లో బుధవారం 1821 కేసులు నమోదు కాగా.. అందులో 40 శాతం టోక్యోలోనే కావడం ఒలింపిక్స్ నిర్వాహకుల్లో ఆందోళన పెంచుతోంది. రాబోయే రోజుల్లో ఒలింపిక్స్ కోసం విదేశాల నుంచి అథ్లెట్ల బృందాలు వేల సంఖ్యలో రానుండగా ఇప్పుడు కేసుల సంఖ్య ఉన్నట్లుండి పెరగడం క్రీడా లోకాన్ని కంగారెత్తించే విషయమే.
మరో 27 రోజుల్లో ఈ సమ్మర్ గేమ్స్ షురూ కానున్నాయి. కానీ అక్కడ నెలకొన్న ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ మెగా ఈవెంట్ జరుగుతుందా? లేదా? అనే సందేహాలు మొదలయ్యాయి. గతేడాదే జరగాల్సిన ఈ క్రీడల సంరంభం.. మహమ్మారి కారణంగా ఈ ఏడాదికి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే పరిస్థితి ఉండటంతో గందరగోళం నెలకొంది. ఇక కరోనా మహమ్మారి భయపెడుతున్నా ఒలింపిక్స్ను ఈ ఏడాది కచ్చితంగా నిర్వహించి తీరుతామని ఓ వైపు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ , మరోవైపు జపాన్ ప్రభుత్వం చెబుతున్నాయి. కానీ మెజార్టీ జపాన్ ప్రజలు మాత్రం ఈ సమ్మర్ గేమ్స్ను వ్యతిరేకిస్తున్నారు. అక్కడి వైద్యులు సైతం మెగా ఈవెంట్ నిర్వహణ వల్ల ఒలింపిక్స్ వేరియంట్ పుట్టుకొచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఇక భారత్ నుంచి ఈ సారి భారీ అథ్లెట్ల బృందమే ఒలింపిక్స్ బరిలో దిగనుంది. ఇప్పటివరకూ 14 క్రీడాంశాల నుంచి 99 మంది అథ్లెట్లు ఈ మెగా క్రీడలకు అర్హత సాధించారు. ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, ఈక్వెస్ట్రియన్, ఫెన్సింగ్, జిమ్నాస్టిక్స్, హాకీ, రోయింగ్, సెయిలింగ్, షూటింగ్, టేబుల్ టెన్నిస్, రెజ్లింగ్, వెయిట్లిఫ్టింగ్ క్రీడల్లో మనవాళ్లు పాల్గొనబోతున్నారు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ పీవీ సింధుతో పాటు రెజ్లింగ్లో బజ్రంగ్ పునియా, వినేశ్ ఫొగాట్, బాక్సింగ్లో మేరీకోమ్, అమిత్, వెయిట్లిఫ్టింగ్లో మీరాబాయి, జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా, పురుషుల హాకీ జట్టు, షూటర్లు మెడల్స్పై ఆశను కల్పిస్తున్నారు.