
అమరావతి: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ 2020లో పాల్గొనే రాష్ట్ర క్రీడాకారులకు ఆంధ్రపద్రేశ్ ప్రభుత్వం అండగా నిలిచింది. వచ్చే నెలలో ఆరంభం కానున్న ఈ సమ్మర్ గేమ్స్ శిక్షణ కోసం ఒక్కొక్కరికి రూ. 5 లక్షల క్యాష్ రివార్డు అందజేసింది. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డినే స్వయంగా ఆటగాళ్లకు బుధవారం చెక్కులు అందజేశారు. ప్రతిష్టాత్మక టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబర్చి దేశ పతకాన్ని రెపరెపలాడించాలని ఈ సందర్భంగా ఆయన అథ్లెట్లకు సూచిస్తూ ఆల్ది బెస్ట్ చెప్పారు.
ఏపీ నుంచి పీవీ సింధు, సాత్విక్ సాయిరాజ్ రాంకీరెడ్డి, రజనీలు టోక్యో ఒలింపిక్స్ బరిలోకి దిగుతున్నారు. ఇక విశాఖపట్నంలో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కేటాయించిన రెండు ఎకరాల భూమికి సంబంధించిన జీవోను వైఎస్ జగన్ సింధుకు అందజేశారు. రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళల హాకీ ప్లేయర్ రజనీ మినహా సింధు, సాత్విక్ పాల్గొన్నారు.
రజనీ ప్రస్తుతం బెంగళూరులోని ట్రైనింగ్ క్యాంప్లో ఉండటంతో ఆమె తరఫున కుటుంబ సభ్యులు హాజరయ్యారు. జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు టోక్యో వేదికగా ఒలింపిక్స్ జరగనున్న విషయం తెలిసిందే. వాస్తవానికి గతేడాదే జరగాల్సిన ఈ సమ్మర్ గేమ్స్ కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాదికి వాయిదాపడ్డాయి.
టోక్యో ఒలంపిక్స్లో పాల్గొనే ఏపీ క్రీడాకారులకు సీఎం జగన్ అభినందనలు

టోక్యో ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్టార్ షట్లర్ పీవీ సింధు జాతీయ పతాకాన్ని చేతబూని భారత బృందాన్ని నడిపించే అవకాశం ఉంది. ఒలింపిక్స్ క్రీడల కోసం ఎంపిక చేసే ఇద్దరు పతాకధారుల్లో సింధు ఒకరని సమాచారం. లింగ సమానత్వం కోసం ఈసారి పురుషులు, మహిళల్లో ఒక్కొక్కరిని పతాకధారులుగా ఎంచుకోనున్నారు. 'ఇద్దరు పతాకధారుల్లో సింధు ఒకరు' అని భారత ఒలింపిక్ సంఘం వర్గాలు తెలిపాయి. సింధుతో పాటు సాయిప్రణీత్, అథ్లెట్ నీరజ్ చోప్రా, టీటీ ఆటగాడు ఆచంట శరత్ కమల్, రెజ్లర్ బజరంగ్ పూనియా, బాక్సర్ అమిత్ పంఘాల్లపై భారత్ ఆశలు పెట్టుకుంది.