
టోక్యో: కరోనా వైరస్ దెబ్బకు వాయిదా పడ్డ ఒలింపిక్స్ వచ్చే ఏడాది కూడా వేసవిలోనే జరగనున్నాయి. 2021 జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు టోక్యో ఒలింపిక్స్ 2020 జరుగుతాయని జపాన్ నిర్వాహకులు సోమవారం ప్రకటించారు. 'ఒలింపిక్స్ వచ్చే ఏడా జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు, పారాలింపిక్స్ ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 5 వరకు జరుగుతాయి'అని టోక్యో ఒలింపిక్స్ కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షుడు యోషిరో మోరీ మీడియాకు తెలిపారు.
ఈ తేదీలను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) కూడా ఆమోదించింది. ఈ ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 9 మధ్య జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ కరోనా కారణంగా వచ్చే ఏడాదికి వాయిదా పడిన విషయం తెలిసిందే. 2021లో జరిగినా టోక్యో 2020 పేరుతోనే ఒలింపిక్స్ జరుగనున్నాయి. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ గేమ్స్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన సమయంలోనే... ఈ క్రీడల్ని వచ్చే ఏడాది మార్చి-మేలో నిర్వహించే అవకాశాలున్నట్లు సూచనప్రాయంగా పేర్కొన్నాడు. విశ్వ క్రీడల నిర్వహణ ఖర్చు గతంతో పోలిస్తే ఈసారి విపరీతంగా పెరుగుతుందని కమిటీ సీఈవో తోషిరో అన్నారు.