
టోక్యో: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్లో భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. శనివారం జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఫైనల్స్లో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని అందుకున్నాడు. ఫలితంగా అథ్లెటిక్స్లో మెడల్ అందించిన తొలి భారత క్రీడాకారుడిగా చరిత్రకెక్కాడు. అదే విధంగా వ్యక్తిగత విభాగంలో గోల్డ్ సాధించిన రెండో భారత్ ప్లేయర్గా గుర్తింపు పొందాడు. నీరజ్ చోప్రా కన్నా ముందు షూటింగ్లో అభినవ్ బింద్రా గోల్డ్ మెడల్ సాధించాడు.
పసిడి పతకంతో జపాన్ నడిబోడ్డుపై భారత మువ్వన్నెల జెండాను రెపరెపలాడించాడు. అద్భుత ప్రదర్శనతో భారత్ ఖాతాలోబంగారు పతకం లేని లోటును తీర్చాడు. మీరాభాయి చాను రజతంతో ఖాతా తెరిస్తే.. నీరజ్ చోప్రా స్వర్ణంతో టోక్యో ఒలింపిక్స్లో భారత ప్రస్థానాన్ని ఘనంగా ముగించాడు. ఒలింపిక్స్కు ఆదివారం చివరి రోజు అయినప్పటీకీ భారత్ అథ్లెట్ల పోటీకి మాత్రం శనివారమే ఆఖరు. నీరజ్ చోప్రా గోల్డ్తో భారత్ మొత్తం 7 పతకాలు సాధించింది. ఇందులో రెండు రజతాలు, నాలుగు కాంస్యాలు, ఓ బంగారు పతకం ఉంది. చివరి రోజు భారత్కు రెండు మెడల్స్ రావడం విశేషం. రెజ్లింగ్లో బజరంగ్ పునియా కంచు మోత మోగిస్తే.. నీరజ్ చోప్రా స్వర్ణంతో ఆ ఆనందాన్ని రెట్టింపు చేశాడు.
ఇక తొలి ప్రయత్నంలోనే ఈటెను 87.03 మీటర్ల దూరం విసిరిన నీరజ్ చోప్రా.. రెండో ప్రయత్నంలో 87.58 మీటర్లతో మరింత మెరుగైన స్థానంలో నిలిచాడు. ఇది అతని కెరీర్ బెస్ట్ రికార్డు. ఇక మూడో ప్రయత్నంలో 76.99 దూరమే విసిరిన నీరజ్ చోప్రా... నాలుగు, ఐదో ప్రయత్నాల్లో ఫౌల్ చేశాడు. చివరి ప్రయత్నంలో 84.24 మీటర్లు విసిరాడు. నీరజ్ చోప్రా తర్వాత 86.67 మీటర్లతో చెక్ రిపబ్లిక్ ప్లేయర్స్ జకుబ్ (VADLEJCH Jakub), వెస్లీ(VESELY Vitezslav)రజతం, కాంస్యం పతకాలు అందుకున్నారు. పాకిస్థాన్ అథ్లెట్ నదీమ్ అర్షద్(84.62 మీటర్లు) ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు.